ఆస్థి

 చదువరి

ఆస్థి

                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



        జ్వలిత నా కవిత, మన్నించు ప్రియా, చక్రతీర్థం, చక్రవ్యూహం, నిక్షిప్త, అన్వేషణ, మచ్చలేని జాబిలి, నయనాంజలి, నేస్తమా నన్నందుకో, నన్ను ప్రేమించకు తదితర నవలలతో ప్రేక్షాకాదరణ పొందిన రచయిత్రి కోగంటి విజయలక్ష్మిగారి నవలల్లో నిక్షిప్త ఓ రాజ్య వంశస్థురాలు తన ఆస్తిని ఎలా పొందుతుంది అనే కథాంశంతో నవలగా మలిచారు.

        నిక్షిప్త రాజాగారి కూతురు. ఆమె బాబాయి, బంధువులు ఆస్తి కోసం రాజాగారి కుటుంబాన్ని హతమారుస్తారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన రాజాగారు ఒకవేళ తమ కుటుంబం మరణించినా, నిక్షిప్త మాత్రం బ్రతికి ఉంటే ఆమెకు ఆ వీలునామా ఇవ్వాలని, ఆమె మరణించి ఉంటే దాన్ని కాల్చేయ్యాలని  రాస్తాడు. ఆ బాధ్యత రాజాగారి లాయర్ కు అప్పగించబడుతుంది.ఆ లాయర్ మరణించడంతో  ఆ బాధ్యత అతని కొడుకు ఆర్యమిత్రకు అప్పగించబడుతుంది.

        అతను ఆ ఇంటికి రక్షకుడిగా ఉన్న భద్రుడి తాత దగ్గరకు వెళ్తే ఆమె బాల్యంలోనే మరణించిందని చెప్తాడు. భద్రుడి మనవరాలు నిఖిలకు స్నేహితుడవుతాడు ఆర్యమిత్ర.నిక్షిప్త బ్రతికే ఉందన్న నమ్మకంతో అతను తన పరిశోధన కొనసాగిస్తాడు.దాంట్లో భాగంగా బాల్యంలో తను, నిక్షిప్త కలిసి ఆదుకున్న ఫోటోని పెద్దయ్యాక ఎలా ఉంటారనే చిత్రం గీయిస్తే దాని ద్వారా నిఖిలే నిక్షిప్త అని తెలుస్తుంది.

        తర్వాత డాక్టర్ శరత్ దగ్గరికి వెళ్తే అందరూ చనిపోయాక, నిక్షిప్తకు ఆ రక్తం అంటితే, ఆమె మరణించిందని భావించారే తప్ప ఆమె మరణించలేదని, ఆ భ్రమ కలిగించడానికి ఆమె పెదవి మీద ఉన్న పుట్టుమచ్చని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించామని, ఆ పరీక్ష చేసి నిక్షిప్త, నిఖిల ఒకరేనని ధృఢపరుస్తాడాయన. తర్వాత ఆమె ప్రాణాలు పోకూడదని భద్రుడి దగ్గర పేద పిల్లలా పెరగనిస్తే ప్రాణాలు దక్కుతాయని భావించి అలా చేశారాయన అని తెలుస్తుంది.

        చివరకు శత్రువులకు తెలియకుండా వీలునామా చదివే ఏర్పాటు చేసినా వారికి తెలిసిపోతుంది. ఆ ఉత్తరంలో ఆమెకు చిన్నప్పుడు చేతికి ఉన్న గాజులు రెండింటికి ఉన్న బొడిపి నొక్కితే  రెండు గాజుల నుండి వచ్చే ఉత్తరం కలిపితే ఆస్తి వివరాలు తెలుస్తాయని ఉంటుంది. ఓ గాజు చిన్నప్పుడు పక్కింటి వరాలు తీసుకున్న విషయం తాత చెప్తాడు.

        చివరకు ఆ గాజులు సాధించి ఆ సంపద ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు (భద్రుడికి రాజు గారు ఇచ్చిన ఇల్లు) గోడలో ఫలకం దగ్గర ఉందని తెలుసుకుంటుంది. కానీ వెంటనే తీస్తే శత్రువులకు తెలియవచ్చని ఆర్యమిత్ర సలహా ఇస్తాడు. నిక్షిప్త, ఆర్యమిత్ర పెళ్ళయిన నెల తరువాత వచ్చి ఆ ఫలకం కింద చూస్తే వజ్రాలుంటాయి. కానీ నిక్షిప్త బాబాయి వాటిని తీసుకుని వారిద్దరిని బంధిస్తాడు.

        అదే నిక్షిప్త తల్లిదండ్రుల ఇళ్లే అని గుర్తిస్తాడు భద్రుడు. తనకు తెలిసిన సొరంగం ద్వారా ఆమెను తప్పించి ఓ అడవిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఉండే చెంచు జాతివారికి నిక్షిప్త తండ్రి ఎంతో సాయం చేసి ఉండటం వల్ల వారు కూడా నిక్షిప్తను కాపాడతామని మాట ఇస్తారు. వీరి కోసం వచ్చిన బాబాయిని,బంధువులని చెంచు జాతివారు హతమారుస్తారు. దానితో నిక్షిప్త ఆస్తి ఆమె సొంతమవుతుంది.

        ఆస్థి చుట్టూ తిరిగే వంశస్థుల కథలు ఓ ట్రెండ్ అయినప్పటికీ ప్రతి రచయిత తనదైన శైలితో దానికి ఓ కొత్త కథను జోడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కోగంటి విజయలక్ష్మి గారి రచనాశైలి నచ్చేవారు తప్పకుండా చదవాల్సిన నవల.

           *     *      *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ