సృజన

 చదువరి

సృజన

                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



       కళాకారులు  సృష్టించే కళాఖండాలు వారికున్న వాతావరణం, వారి మనస్థితి ఆధారంగా ఉంటాయి. ప్రతి సారి కళాకారుడు ఓ అద్భుతాన్ని సృష్టించలేడు. మంచి కళాత్మక సినిమాలు తీసే దర్శకుడు తేజస్వి తను కూడా మూస ధోరణిలో పడిపోతున్నానని గుర్తించి స్పూర్తి కోసం ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడి పల్లెటూరి జీవితాలు అతని మీద చూపిన  ప్రభావమే ఆకునూరి హసన్ గారి శిలాపుష్పంనవల.

           సినీ దర్శకుడు తేజస్వి. మొదటి నాలుగు సినిమాలు హృదయాత్మకంగా తీసిన అతను తర్వాత మసాలా,కమర్షియల్ మూస ధోరణిలో పడిపోతాడు.దానితో  అతను తనలో క్రియేటివ్ వ్యాక్యూమ్ ఏర్పడిందని గ్రహించి దాన్ని తొలగించుకుని మంచి స్థాయి ఉన్న సినిమాలు తీయాలని నిర్ణయించుకుంటాడు.దానికి అతని మిత్రుడు శశాంక్  తన ఊరు పల్లెటూరైన అగ్రహారంలో నెలరోజులు ఉంటే  బావుంటుందని సూచించడంతో,అతను అక్కడికి వెళ్తాడు. అక్కడ శశాంక్ సొంత ఇంటిని అద్దెకిస్తాడు. అందులో మూడు అంతస్థులో ఓ భాగాన్ని అతని కోసం ఏర్పాటు చేస్తాడు. తన స్నేహితురాలు మధులిక ద్వారా అతనికి భోజనం ఏర్పాటు చేస్తాడు.

          అతను వచ్చిన తర్వాతి రోజు అనుదీప్, అతని స్నేహితురాలు తుషార కూడా అక్కడికి వస్తారు. అగ్రహారం పక్కనే రంగు రాళ్ళ వ్యాపారం మాఫియాగా సాగుతుంది. దాని గురించి కథనం రాసినందుకే  జర్నలిస్టు అనుదీప్ ప్రాణాలకు ముప్పు రావడంతో అతను తుషారతో అగ్రహారం వస్తాడు. అతను కథనం రాయడానికి వెళ్ళినప్పుడు ఓ గిరిజనుడు ఇచ్చిన నీలం రాయి అతను ఎన్నిసార్లు వదిలించుకున్నా తిరిగి అతని దగ్గరకే వస్తుంది.

          రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకునే 13 ఏళ్ళ అబ్బాయి చిన్నబ్బాయి. అతని తండ్రి జోషి అనే మాఫియా లీడర్ తో పని చేసేవాడు. ఏదో స్పర్ధల వల్ల అతన్ని జోషి హత్య చేస్తాడు. తర్వాత తల్లి కూడా మరణిస్తుంది. దానితో జోషి మీద కక్ష పెంచుకుంటాడు చిన్నబ్బాయి.

          జోషికి ఉంపుడుగత్తెగా ఉన్న దేవసేన తేజస్వి ఉండే మేడలోని మూడవ అంతస్థులోనే ఉంటుంది. శశాంక్ తన స్నేహితుడైన తేజస్విలో ఆమెను కొత్త స్పందనలు సృష్టించమని చెప్తాడు. జోషి ఆమె దగ్గరకు వచ్చి పోతుండేవాడు.అదే ఊర్లో ఉండే సత్తిబాబు అనే కిరాణాకొట్టు వ్యాపారి తన తాతల నుండి సంక్రమించిన పచ్చరాయిని జోషికి అమ్మి డబ్బు చేసుకుంటాడు. తిరిగి వస్తున్న జోషిని చిన్నబ్బాయి హత్య చేస్తాడు. చనిపోయేముందు తన ఆస్థినంతా దేవసేనకు అప్పగిస్తాడు జోషి. డబ్బు కోసం వారసత్వంగా వచ్చిన రాయిని  సత్తిబాబు అమ్మితే, తమ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన పచ్చబొమ్మను మాత్రం ఆ ఊరి పూజారి అమ్మడు. అదే విలువల వ్యత్యాసం.

          తేజస్వికి అపరిచిత వ్యక్తిగా పరిచయం అయిన దేవసేన అతనిలో ఎన్నో కొత్త స్పూర్తులకు నాంది అవుతుంది. ఊరిలో ఎన్నో కోణాలు పరిచయం చేస్తుంది. ఆమె కలవాలనే కోరిక మొదట్లో ఉన్నా,తన ఊహల్లోనే ఆమెను ఉంచుకోవాలనే నిర్ణయంతో ఆమె పక్కనే ఉందని తెలిసినా కలవడు.

          జోషిని చంపిన చిన్నబ్బాయి అదే విషయం వచ్చి దేవసేనకు చెప్తాడు. బ్రతకడానికి సరిపోయే డబ్బును తీసుకుని,చిన్నబ్బాయిని కొడుగ్గా పెంచుకోవడానికి సిద్ధమై,మిగిలిన డబ్బును సూట్ కేసులో పెట్టి తేజస్వి ఇంటి ముందు పెట్టి, దాని ద్వారా బాల కార్మికులు,కులటలు మరియు అవసరం ఉన్న వారి సహాయార్ధం వినియోగించయమని ఫోన్ లో కోరి,ఆమె వెళ్లిపోతుంది.

          అలా నెలరోజులు ఉందామని వచ్చిన తేజస్వి ముందే సినీ స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు.అనుదీప్,తుషార,ఆ ఊరి పూజారి గారమ్మాయి అయిన లక్ష్మి తులసి లను నటులుగా ఎన్నుకుని వెళ్ళిపోతాడు. శిలాపుష్పం అతను అంతకుముందు తీసిన కళాత్మక సినిమా.

          ప్రతి మనిషి తన జీవితంలో తనలోని  సృజనను కోల్పోతున్నప్పుడూ గుర్తించి దానిని వెలికి తీసే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనిషి తనలోని తనతో సంతోషంగా ఉండగలడు.

   *       *      *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ