ఆత్మాభిమానం

 చదువరి

ఆత్మాభిమానం

                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ఆనందం,ఆత్మాభిమానం, వ్యక్తిత్వం,సామర్ధ్యం అంటే ఏమిటో తెలుసుకునే ఓ ఆడపిల్ల ప్రయత్నమే బలభద్రపాత్రుని రమణి గారి  అనూహ్య నవల.  

          అనూహ్య వివేక్ ను పెళ్లి చేసుకుంటుంది. బాల్యం నుండి సాంప్రదాయాలతో  పెరిగిన ఆమె పెళ్ళయిన తర్వాత డాక్టర్ వివేక్ భార్యగా మారాక ఇంకా కొన్ని చాదస్తాలతో ఉండటం వివేక్ కు నచ్చదు. ప్రాక్టికల్ గా ఉండటం, భార్య ఆలోచనలు ఆమె స్వేచ్చకే వదిలివేయడం వివేక్ గుణం. ఈ ఆలోచనా ధోరణిని అనూహ్య తన పట్ల నిర్లక్ష్యంగా భావిస్తుంది.

          బంధువులు ఎవరో చనిపోతే మైల పేరుతో ఎవర్ని తాకకూడదు అన్న రోజు వివేక్ తన స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తాడు. అలా చాదస్తంగా ప్రవర్తించడంతో వారు వెళ్ళిపోతారు. ఇలా చాదస్తాలకు దూరంగా ఉండమనడం తన అభిప్రాయాలకు విఉవా లేకపోవడంగా అనూహ్య భావిస్తుంది.

          తనకు విడాకులు కావాలంటుంది. ఓ సంవత్సరం  విడిగా ఉంటే మ్యూచువల్ కన్సెంట్ తో తీసుకోవచ్చనే పత్రాల మీద ఇద్దరూ సంతకాలు పెడతారు. ఫ్లాట్ అనూహ్యకి అమ్మమ్మ ఇచ్చింది కనుక ఆమె దగ్గరే వివేక్ పేయింగ్ గెస్ట్ గా ఉంటాడు. వివేక్ సెక్రటరీ తన్మయి కూడా వచ్చి వెళ్తూ ఉంటుంది.

          తనను తాను స్వతంత్రంగా చేసుకునే ప్రయత్నంలో ఓ స్కూల్ టీచర్ గా జాయిన్ అయినా ఇమడలేక మూడు రోజుల్లో వదిలేస్తుంది. వివేక్ ను ఏడిపించాలని సమీర్ అనే ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడితో పరిచయం పెంచుకుంటుంది.అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ లో కాలేజీలో ఆమె వెంటబడ్డ సీనియర్ శరత్చంద్రతో స్నేహం మళ్ళీ మొదలవుతుంది. శరత్చంద్ర ఆమె దగ్గర అతి చనువు తీసుకుని ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను అత్యాచారం చేయబోతే వివేక్ వెళ్ళి  ఆమెను కాపాడతాడు.

          తన్మయి అతని బంధువని,గుండె జబ్బుతో బాధపడుతుంటే బాగు చేయించి,నచ్చిన అతనితో ఆమె వివాహం చేయించబోతున్నాడని తెలుసుకుంటుంది. ఈ మధ్యలో పైకి కనిపించే దంపతుల ప్రేమలో ఉండే బాధలు కూడా తెలుసుకుంటుంది. వివేక్ ను అర్ధం చేసుకుని చివరకు అతనితో కలుస్తుంది.

          ఏ పరిస్థితుల్లో స్త్రీ పెరిగినా సరే తానేమిటో తాను తెలుసుకునే ప్రయత్నం తప్పక ప్రతి స్త్రీ చేయాలి. అదే ఆమెను ఆమె జీవితంలో సాధించాల్సిన ఏ అంశం వైపైనా పయనించేలా చేస్తుంది.

                                *     *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ