ఆగిపోయిన పెళ్ళి

 చదువరి

ఆగిపోయిన పెళ్ళి

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


       ప్రముఖ  రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి గారి అక్క అయిన గోవిందరాజుల సీతాదేవి గారు కూడా ప్రముఖ రచయిత్రే. ఆవిడ నవలల్లో తుంగభద్ర నవలలో ఎలా మనుషులు దగ్గర అవుతారో, ఎటువంటి పరిస్థితులు వారిని దూరం చేస్తాయో వంటి అంశాలను చక్కగా రాశారు.

          చంద్రమోహన్ ఓ డాక్టర్. బాగా డబ్బున్నవాడు అవ్వడం వల్ల బీదాబిక్కిబారికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటాడు. తుంగభద్ర స్టీల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ ఉన్నాడు. ఓ సారి అతనికి యాక్సిడెంట్ అయితే తన రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడతాడు చంద్రమోహన్. అలా రామకృష్ణ కుటుంబంతో  అతనికి అనుబంధం ఏర్పడుతుంది. రామకృష్ణ భార్య శశికళను వదిన అని పిలుస్తూ ఉంటాడు.

          శశికళ చెల్లెలు  కృష్ణవేణి. రామకృష్ణ పిన్ని కొడుకు హరి. ఓ సారి సెలవులకు  కృష్ణవేణి వస్తుంది. అదే సమయంలో  బంధువులకు ఏదో ప్రమాదం జరగడంతో  శశికళ, భర్తా పిల్లలతో కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హరితో, రామకృష్ణతో కృష్ణవేణికి పరిచయం ఏర్పడుతుంది. చంద్రమోహన్, కృష్ణవేణి ఒకరినొకరు ఇష్టపడినా పట్టించుకోరు. వెళ్ళేటప్పుడు  అతనికి చెప్పి వెళ్దామని చంద్రమోహన్ ఇంటికి వెళ్ళిన వేణికి అక్కడ అతను ఇంకో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడటం చూసి అతన్ని అపార్ధం చేసుకుంటుంది.

          డాక్టర్ మోహన్ కు  రోగులుగా పరిచయమైన  కుటుంబరావు కుటుంబంతో  అనుబంధం ఏర్పడుతుంది. అప్పటికే అధిక సంతానవతి అయిన కుటుంబరావు భార్య వెంకటలక్ష్మికి మళ్ళీ కవలలు పుడతారు. శకుంతల,కుంతల ఇద్దరూ వయసులో ఉన్న పిల్లలు. శకుంతలే మిగిలిన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. పరమశివం, సాంబశివం,గోవిందు, గోపీ ఆఖరిగా సుశీ ,శశీ. కుంతల ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అలాగే బంగారయ్య అనే ధనవంతుడు కూడా తన భార్య మొహినికి  బాలేదని రమ్మంటే వెళ్తాడు మోహన్. రెండవరోజు మోహన్ డాక్టరుగా అక్కడికి వెళ్ళేసరికి మొహిని అతన్ని కామిస్తుంది. అతను అసహ్యంతో వచ్చేసినా ఆమె పదిలిపెట్టదు. మోహన్ రచయిత కూడా. అతని రచనలు చదివే అతని మీద ఇష్టం పెంచుకుంటుంది మొహిని.

          రెండోసారి శశికళ దగ్గరకు వచ్చిన వేణి  తను వెళ్లినప్పుడు మోహన్ తో ఉన్నది అతని పెద్దమ్మ కూతురు అని తెలుసుకుంటుంది. అన్న చదివిస్తానానన్నా సరే హరి తన సొంత ఉద్యోగం కోసం వేరే వెళ్ళిపోతాడు. శశికళను మోహన్ కు ఇచ్చి వివాహం చేయడానికి శశికళ వేణి తండ్రి శేషగిరిరావును ఒప్పిస్తుంది. పెళ్ళి నిశ్చయమవుతుంది.

          ఓసారి శశికళ ప్రమాదంలో ఉందని ఉత్తరం వస్తే వెళ్ళిన మోహన్ కి అది మొహిని తనని రపించడానికి పన్నిన వల అని అక్కడికి వెళ్లాక తెలుస్తుంది. మోహన్ మాటల్థో మారిన శశికళ  కొత్త జీవితాన్ని  ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో అక్కడికి  బంగారయ్య తన మనుషుల్ని తీసుకువచ్చి మొహిని తీసుకొచ్చి ఇంట్లో ఖైదు చేస్తాడు. తర్వాత  కుంతల తనకు నచ్చిన వాడైన కృష్ణమూర్తిని రిజిస్టర్  మ్యారేజ్ చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతుంది. శకుంతల గర్భవతి అవుతుంది. దానికి కారణం మోహన్ అని నమ్మడంతో  వేణితో మోహన్ పెళ్ళి ఆగిపోతుంది.

          శకుంతలను ఇంట్లో అందరూ హింసిస్తుంటే  తనతో తన ఇంటికి తీసుకువస్తాడు చంద్రమోహన్. హరి వేణి పెళ్ళి కోసం వచ్చి ఆ పెళ్ళి ఆగిపోయిందని తెలుసుకుని మోహన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న శకుంతలను చూసి ఆశ్చర్యపోతాడు.

          హరి తానే శకుంతల కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అని చెప్తాడు. మోహన్ వారిద్దరి పెళ్ళి జరిపిస్తాడు.అప్పుడే అక్కడికి వచ్చిన శశికళకు కూడా నిజం తెలియడంతో వేరే వారితో నిశ్చయించబడిన వేణి వివాహాన్ని ఆపి మోహన్ తో పెళ్ళి చేయడంతో నవల ముగుస్తుంది.

          డ్రామా ఎక్కువున్న నవల అయినప్పటికీ  కథ ఆగకుండా పరిగెడుతూ ఉండటం వల్ల చదువరులకు ఆసక్తిని కలుగజేస్తుంది. నాటి రచనల్లో ఒకే కుటుంబ అంశాల్ని ఎన్నుకున్నా వాటిలో ఉన్న వైవిధ్యం తెలియాలంటే ఇటువంటి నవలలు చదవాల్సిందే.

   *     *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ