హిట్లర్ మరణం

చదువరి

                     హిట్లర్ మరణం

                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          హిట్లర్ మరణం చుట్టూ ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. జర్మన్ నియంతగా ప్రపంచాన్ని ఒణికించి, మిలియన్ల జనుల ప్రాణాలు తీసి చివరకు రష్యాకు చెందిన రెడ్ ఆర్మీకి దొరికిపోయే సందర్భంలో బంకర్ లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడనే చరిత్ర పుస్తకాలు చెప్తాయి.కానీ అది నిజం కాదని ఆ సమయంలో అతను,తన భార్య అయినా ఇవాతో కలిసి పారిపోయి లోకాన్ని అలా నమ్మించాడని ఎందరో నేడు నమ్ముతున్నారు. ఈ  వివాదం ఆధారంగా ఇర్వింగ్ వాలస్ రాసిన నవలే ద సెవెన్త్ సీక్రెట్.

          ఆక్స్ ఫర్డ్ హిస్టారియన్ అయిన హారిసన్ యాష్ క్రాఫ్ట్ హిట్లర్ జీవిత చరిత్రను తన కూతురు ఎమిలితో కలిసి పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సమయంలో అతనికి వెస్ట్ బెర్లిన్ నుండి ఓ అజ్ఞాత ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో హిట్లర్ సూసైడ్ చేసుకోలేదని,ఆ విషయం నిరూపించడానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయని ఉంటుంది. అందులో ఉన్న నిజానిజాలు తేల్చుకోవడానికి యాష్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళి అతన్ని కలుస్తాడు. అతను హిట్లర్ డెంటిస్ట్ లలో ఒకరు. అతని దగ్గర నిజాలు తెలుసుకున్న మరుక్షణం హిట్లర్ మరణించాక అతన్ని పూడ్చి కాల్చిన బంకర్ పరిసరాల్లో మళ్ళీ తవ్వడానికి అనుమతి కూడా తీసుకుంటాడు.హిట్లర్ మరణం గురించి తనకు కొత్త వాస్తవం తెలిసిందని మాత్రమే చెప్పి వివరాలు ఏమి చెప్పకుండా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తాడు. దాని ద్వారా ఆ విషయం తెలిసిన వారు ఇంకా ఎవరినా ఉంటే ముందుకు వస్తారని. ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక అతను వెళ్తూ ఉండగా ఓ యాక్సిడెంట్ అయ్యి అతను మరణిస్తాడు.

          ఆ యాక్సిడెంట్ ను చూసిన ఓ రిపోర్టర్ అది యాక్సిడెంట్ కాకుండా హత్య అయ్యి ఉండవచ్చేమోనన్న అనుమానాన్ని యాష్ క్రాఫ్ట్ కూతురు ఎమిలికి ఉత్తరం ద్వారా తెలియజేస్తాడు.తన తండ్రి మొదలుపెట్టిన దానిని తాను పూర్తి చేయాలని ఆమె కూడా బర్లిన్ వెళ్తుంది. అమెరికన్ ఆర్కిటెక్ట్ అయిన రెక్స్ ఫోస్టర్ హిట్లర్ సమయంలో ఉన్న కట్టడాల గురించి ఓ పుస్తకం రాస్తూ ఉంటాడు. సోవియట్ మ్యూజియం క్యురేటర్ అయిన నీల్ కిర్వోవ్ కు ఒకతను హిట్లర్ సంతకం పెట్టకపోయినా  హిట్లర్  పెయింటింగ్ ఒకటి ఇస్తాడు. జెరూసలేం రిపోర్టర్ అయిన టోవాహ్  మోసాద్ అనే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు కూడా పని చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ బ్రతి ఉన్న నాజీల వివరాలు కనుక్కోవడం ఆమె పని. ఇలా ఎమిలి కాకుండా మిగిలిన ముగ్గురు కూడా తమ తమ స్వవిషయాల కోసం బర్లిన్ వస్తారు. వీరందరూ ఎమిలి హిట్లర్ గురించి రాస్తుంది కనుక ఆమెకు తమకు కావల్సిన విషయాలు తెలిసే ఔందని భావించి ఆమెను కలుస్తారు. వీరు నలుగురు కలిసి హిట్లర్ రహస్యం ఎలా చేధించారు అన్నదే మిగిలిన కథ.        

          ఎమిలి తన తండ్రికి ఆజ్ఞాత ఉత్తరం రాసి  అతన్ని తర్వాత కలిసిన డెంటిస్ట్ ను కలుస్తుంది. అతని ద్వారా హిట్లర్ పళ్ళకు గోల్డ్ క్యాప్ ఉందని, అది ఆ బంకర్ లో మరణించిన వ్యక్తుల దగ్గర లేదని, అలాగే హిట్లర్ దగ్గర ఉన్న ఓ లాకెట్ కూడా అక్కడ లేదని చెప్తాడు. వాటిని నిరూపించడానికి ఏమిలి అక్కడ తవ్వడానికి అనుమతి తీసుకుంటుంది. రెక్స్ ఫోస్టర్,ఎమిలి ఈ క్రమంలో ప్రేమలో పడతారు.ఎమిలి మీద జరిగిన ఓ హత్యా ప్రయత్నం నుంచి ఆమెను కాపాడతాడు రెక్స్.

          నీల్ కిర్వోవ్ ఆ పెయింటింగ్ వేసిన కాలం 1952 కానీ హిట్లర్ మరణించింది 1945 లో. అంటే హిట్లర్ ఆత్మహత్య చేసుకుని మరణించాడన్నది అబద్ధం అవ్వవచ్చనే నిర్ధారణకు వస్తారు. ఎందుకంటే ఆ పెయింటింగ్ లో ఉన్న నాజీ బిల్డింగ్ ముందే కట్టబడినా ఆ తర్వాతి కాలంలో కాస్త డ్యామేజ్ అవ్వడంతో దానిని మళ్ళీ 1952 లో రిమోడలింగ్  చేయించారు. 1952 లో ఉన్న రిమోడల్ బిల్డింగ్ ఆ పెయింటింగ్ లో ఉండటంతో వారికి ఆ అనుమానం వస్తుంది.

          ఆ సమయంలో హిట్లర్,ఇవా తమ బదులు తమ డబుల్స్ ను వాడి ఉంటారనే వాదన కూడా ఉండటంతో దానిలో నిజానిజాలు తెలుసుకోవడానికి టోవాహ్ బయల్దేరుతుంది. అలా హిట్లర్,ఇవాలు  వాడిన డబుల్స్  గురించి తెలుసుకుంటుంది టోవాహ్. అలాగే హిట్లర్ దగ్గర బంకర్ లో గార్డ్ గా పనిచేసిన అతను హిట్లర్ మరణించే రెండు రోజుల ముందు బయటికి వెళ్ళి రావడం తనకు తెలుసని చెప్తాడు. దానికి సంబంధించిన లాగ్ బుక్స్ కూడా ఉన్నాయని చెప్తాడు. వాటి కోసం ఎమిలి, టోవాహ్ వెళ్ళేసరికి అతను హత్య చేయబడతాడు.

          ఇక ఆ పెయింటింగ్ గురించి ఆరా తీస్తున్న నీల్ కు ఆ పెయింటింగ్ అమ్మిన క్లారా  ఇంటికి వెళ్తాడు. కానీ ఆమె తనకు ఆ పెయింటింగ్ గురించి ఏమి తెలియదని చెప్తుంది. దానికి కారణం ఆమె ఆంటీ అయిన ఏవిలిన్ ఆమెకు,ఆమె భర్తకు పెళ్ళి రోజున ఇస్తుంది. అది నాజీ పెయింటింగ్ అవ్వడంతో దానికి వ్యతిరేకి ఆమె భర్త అవ్వడంతో దానిని అమ్మేస్తుంది క్లారా. ఈ విషయం బయటపడితే ఆంటీ బాధపడుతుందని తనకు ఏం తెలియదని చెప్తుంది.

          ఆ తర్వాత ఆమె తన ఆంటీని రమ్మని పిలిచి జరిగింది చెప్తుంది. తాను ఏం బాధపడటం లేదని చెప్తుంది ఏవిలిన్. ఏవిలిన్ ను అక్కడ చూసిన నీల్ ఆమెను ఫాలో అవుతాడు. ఆమె ఓ కేఫెలోకి వెళ్తుంది. కానీ అది మూసేసినా ఆమె బయటకు రాకపోవడం కూడా అతను గమనిస్తాడు. ఈ విషయం మిగిలిన వారికి చెప్తాడు. అందరూ కలిసి ఆమెను ఫాలో అవుతారు. ఆమె కేఫెకు రాకముందు పోలీస్ చీఫ్ అయిన వొల్ఫ్ గాంగ్ ను కలవడం, ఆ తర్వాత కేఫెకు వెళ్ళడం గమనిస్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తాను లోపలికి వెళ్తానని, ఒకవేళ కేఫే మూసేసినా సరే తాను రాకపోతే రెక్స్ కు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని వారికి చెప్పి ఎమిలి లోపలికి వెళ్తుంది.

          అలా లోపలికి వెళ్ళిన ఆమె కిచెన్ లోకి వెళ్తుంది.అక్కడ ఆమె వారి బంధి అవుతుంది. ఇక సమయం మించిపోయిన ఆమె తిరిగి రాకపోవడంతో నీల్ రెక్స్ కు మిగిలిన వారికి ఆ విషయం చెప్తాడు. రెక్స్ పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న టోవాహ్ ఆ పోలీస్ చీఫ్ ఏవిలిన్ వైపు వ్యక్తి అని, వారి కన్నా మోసాద్ వారికి సరైన సాయం చేస్తుందని ఒప్పిస్తుంది. రెక్స్ హిట్లర్ బిల్డింగ్స్ లో మిస్ అయిన ఏడో బిల్డింగ్ గురించి తెలుసుకోవడం వల్ల దాని ఆధారంగా ఆ తవ్వుతున్న బంకర్ లోపల ఉన్న సొరంగం గురించి తెలుసుకుని వెళ్తాడు. ఆ కేఫే నుండి బంకర్ వరకు ఆ సొరంగం ఉందని అతనికి అర్ధమవుతుంది.అక్కడ ఉన్న ఏమిలిని రక్షిస్తాడు. ఏవిలిన్ కు పెంటతాల్ ఇచ్చి ఆమె చేత నిజాలు చెప్పిస్తాడు.

          ఏవిలిన్ ఇవా అని, హిట్లర్ ,ఆమె అప్పుడు ఆత్మహత్య చేసుకోలేదని, తమ డబల్స్ ను అక్కడ ఉంచి తాము తప్పించుకున్నామని,అప్పటి నుండి నాజీల పట్ల సానుభూతి ఉన్న వారిని ఒకటిగా చేసి మళ్ళీ అదే సామ్రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నామని, వుల్ఫ్ గాంగ్ తనకు ఒకప్పుడు హిట్లర్ ఉంచిన సంరక్షకుడు అని,పైకి మాత్రం నాజీలకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉండటం వల్ల ఆ పదవి సాధించాడని, అతని నాయకత్వంలోనే అప్పటికే 50 వేల మంది నాజీలను ఆ సొరంగంలో అన్ని సౌఖర్యాలతో ఉంచుతున్నామని చెప్తుంది. ఏమిలిని అక్కడ నుండి వెళ్ళి టోవాహ్ ను కలుసుకుని,ఆమె సాయంతో ఇక్కడ హిట్లర్ నాజీలను చంపినట్టే గ్యాస్ ద్వారా ఉదయం మూడు గంటలకు గ్యాస్ ద్వారా అందర్నీ చంపేయ్యమని ఈలోపు తాను తప్పించుకుని వస్తానని చెప్తాడు. ఎమిలి తప్పించుకుంటుంది. రెక్స్ ఇవాను కూడా తీసుకువస్తున్న సమయంలో వుల్ఫ్ గాంగ్ రావడంతో అతనితో ఘర్షణ జరిగాక అతను స్పృహ తప్పాక, అక్కడి నుండి ఆమెతో బయటకు వస్తాడు రెక్స్.

          బయటకు వచ్చాక రెక్స్ ఎమిలితో మాట్లాడుతున్న సమయంలో ఇవా తప్పించుకుంటుంది.టోవాహ్ సాయంతో మోసాద్ సంస్థ ద్వారా ఆ కేఫే కింద సొరంగంలో పాజినస్ గ్యాస్ వదులుతారు. అక్కడ వారంతా మరణిస్తారు. వారు చేయబోయేది ముందే గ్రహించిన ఇవా తన భర్త హిట్లర్ అంతకు ముందు తనకు చెప్పిన మీట ద్వారా ఆ సొరంగాన్ని పేల్చేస్తుంది. ఆ తర్వాత తాను తల్లి అని చెప్పకుండా పెంచిన క్లారాతో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తుంది. క్లారా మాత్రం తాను హిట్లర్ కూతురిగా బ్రతకడం ఇష్టం లేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత ఇవా ఏమైందో ఎవరికి తెలియదు. హిట్లర్ గురించి నిజాన్ని బయట పెట్టడానికి ఉన్న ఒకే ఒక సాక్ష్యం అయిన  ఇవా కూడా మాయమవ్వడంతో ఎమిలికి ఉన్న ఆధారం కూడా పోతుంది.ఇక   

        హిట్లర్ జీవితం గురించి తెలిసాక కూడా ఆధారాలు లేకుండా సందిగ్ద పరిస్థితుల్లో ఉండిపోతుంది ఎమిలి. నిజం తెలిసినా సాక్ష్యం లేని నిజం అబద్ధం కిందే లెక్క. అందుకే ఆ వాస్తవం అలా ఇవా తప్పించుకోవడంతో అలా వారితోనే ముగిసిపోతుందనే అంతర్లీన సందేశంతో నవల ముగుస్తుంది.ఇర్వింగ్ వాలస్ వివాదాస్పదమైన అంశాన్ని ఎన్నుకోవడంతో కొంతమేరకు ఆసక్తికరంగా ఉన్నా,కాకపోతే కొంతమేరకు అసంతృప్తిగా మధ్యలో ముగిసిందనే భావన కలగక మానదు.కానీ ఇర్వింగ్ వాలస్ పరిశోధనాత్మక  రచయిత కనుక తప్పక చదవాల్సిన నవల ఇది.

                   *      *      *  


Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ