మగ రాజ్యం

 చదువరి

                     మగ రాజ్యం

                           -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)    


          స్త్రీలకు పెళ్ళితో జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఒక్కసారి కోడలిగా అడుగుపెట్టాక ఆమెను పరాయి వ్యక్తిగా చూడటం నాటి కాలంలో సహజం.నాటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని తురగ జయా శ్యామల గారు రాసిన మగరాజ్యంలో ఆడే బొమ్మనవల పురుషుడి  మనస్తత్వం ఏర్పడటంలో అతని తల్లి పాత్ర ఏమేరకు ఉంటుందో స్పష్టం చేస్తూనే,స్త్రీ జీవితంలోనూ ఆమె పాత్ర ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చెప్తూ,ఆ ప్రభావం ఆ ఇంటి కోడళ్ళ జీవితాలను ఎలా నాశనం చేసిందో స్పష్టం చేస్తుంది.

 పార్వతికి  రాజారావుతో వివాహమవుతుంది. రాజారావు సొంత వ్యక్తిత్వం లేని మనిషి. బాల్యంలోనే భర్త మరణించడంతో కమలాంబ కొడుకులను మాత్రం తన మాట జవదాటకుండా ఉండేలా పెంచింది. ఆమెకు రాజారావు పెద్ద కొడుకు. రఘు తర్వాత కొడుకు.న శ్రీవల్లి కూతురు. ఆమెకు పెళ్లయిపోయింది. ఆమె అత్తవారిల్లు అదే ఊరిలో ఉండటంతో  దాదాపు ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. రేణుక చిన్న కూతురు. తల్లి గారాబం వల్ల పెంకిగా తయారైంది. కాలేజీలో డిగ్రీ చదువుతుంది.

          ఈ పరిస్థితుల్లో  పార్వతి అత్తవారింట్లో అడుగు పెడుతుంది. ఆమె పరిస్థితి  ఇంటి పనిమనిషిలా ఉంటుంది. భర్త రాజారావు ఆమెతో సరిగ్గా మాట్లాడడు. పార్వతి గర్భవతి అవుతుంది. కోపంతో రాజారావు ఆమె మీద చెయ్యి చేసుకోవడంతో ఆమె గర్భం పోతుంది. శ్రీవల్లి, కమలాంబ,రేణుక ఆమెకు నరకం చూపిస్తారు.

          రేణుక అందగత్తె. కాలేజీలో, బయట అబ్బాయిల్ని తన వెంట తిప్పుకోవడం ఆమెకు సరదా. వారితో కాఫీలు తాగుతూ, సినిమాలకు వెళ్తుంది. అలా వారిని రెచ్చగొట్టి ఆ తర్వాత వదిలేస్తుంది.

          పార్వతి రెండోసారి గర్భవతి అవుతుంది. తొమ్మిదో నెల వరకు పుట్టింటికి పంపరు. ఓ బాబును కంటుంది. పార్వతి వదిన హైమ కజిన్ శేఖర్ పుట్టింటి తరపున ఆమెను చూడటానికి వస్తుంటాడు. రేణుక అబ్బాయిలతో తిరుగుతున్న విషయం పక్కింటావిడ పార్వతితో చెప్పడంతో  ఆ విషయం ఆమె భర్తతో చెప్తే,ఆమెనే నిందిస్తాడు రాజారావు.

          ఓ రోజు ఇల్లు సర్దుతూ ఉంటే మాన్ సింగ్ రేణుకకు రాసిన ఉత్తరం చూస్తుంది పార్వతి. రేణుకను మందలించబోతే, శేఖర్ తో ఆమెకు సంబంధం అంటగడుతుంది రేణుక. అది నమ్మి రాజారావు కూడా పార్వతిని కొడతాడు. పార్వతి బాబును తీసుకుని ఆమెను పుట్టింటికి తరిమేస్తారు. పార్వతి పుట్టింటికి చేరుకుంటుంది. ఎంత నచ్చజెప్పినా ఆమె అత్తింటికి వెళ్ళనని అంటుంది. బి.ఎడ్ పూర్తి చేసి టీచర్ గా ఉద్యోగం సంపాదిస్తుంది.

          ఈ లోపు రేణుక రెచ్చగొట్టిన  మాన్ సింగ్ తెలివిగా ఆమెను హోటల్ కి తీసుకెళ్ళి రేప్ చేస్తాడు. తర్వాత ఆమెతో జరిగిన గొడవలో ఆమెను ఆవేశంతో హత్య చేస్తాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకు  సరోజతో రాజారావుకు వివాహమౌతుంది. సరోజ పార్వతిలా కాకుండా మాటకు మాట చెప్పే రకం.

          పార్వతి బాబును సరోజకు దూరంగా ఉంచుతుంది కమలాంబ. టీచర్ గా పని చేస్తున్న నీరజ సరోజకి స్నేహితురాలు. ఆమె చెల్లెలి వివాహానికి వెళ్ళినప్పుడు సరోజ పార్వతికి కనబడుతుంది. అలా రాజారావుకు సరోజతో మరో వివాహం జరిగిందని తెలుస్తుంది. సరోజకు తన గురించి ఏమి చెప్పదు పార్వతి.

          బాబును మాత్రం తన దగ్గరకు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటుంది పార్వతి. సరోజ ఒక రోజు మాటకు మాట చెప్తే గొడవ జరుగుతుంది. ఆమె వంటింట్లోకి వెళ్తుంది. ఆమెను లోపలికి తోస్తాడు రాజారావు, అదే సమయంలో అక్కడే ఉన్న కిరసనాయిల్ డబ్బా సరోజ మీద పడి ఆమె శరీరమంతా ఆ ద్రవమే ఉంటుంది. బయట నుంచి అగ్గిపెట్టె ఇచ్చి ఆమెను హత్య చేయమని ప్రోత్సహిస్తుంది కమలాంబ. అలా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆవేశంలో వెలిగిస్తాడు రాజారావు.

          ఈ లోపు అక్కడికి పార్వతి వస్తుంది. బాబును తీసుకుని, సరోజను హాస్పటల్ లో చేర్పిస్తుంది. హత్యా నేరంలో తను ఇరుక్కుంటుందని భయపడి కూతురు ఇంటికి వెళ్ళిపోతుంది కమలాంబ. పార్వతిని తనను ఈ హత్యా నేరం నుండి కాపాడమని అడగటానికి వెళ్తాడు రాజారావు.అప్పటికే సరోజ మరణిస్తుంది. పార్వతి అగ్ని కణికలా బయటకు వస్తుంది అతనికి శిక్ష తప్పదన్నట్టుగా. దీనితో నవల ముగుస్తుంది. ఈ నవల ఆంధ్రభూమి వారపత్రిక నవలాపథంలో ప్రచురించబడింది.

          కొందరి మనస్తత్వాలు ఎటువంటి మనుషులు వారి జీవితాల్లో ఉన్న మారవు. పార్వతి సర్దుకుపోయింది కనుక ఆమె కొంతకాలం ఉండగలిగింది. సరోజ స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల చావు వరకు వెళ్ళింది. ఇలాంటి సమస్యలు చదువులతో మారవు,మనుషుల సంస్కారాలతో మాత్రమే మారతాయి.

  *     *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ