ఫేక్ న్యూస్

 సీజనల్  సమీక్షలు

                   ఫేక్ న్యూస్

                                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          మనిషి హత్య చెయ్యబడ్డాడు అంటే అందరూ బాధ పడతారు,జాలి పడతారు,ఆ వ్యక్తి కుటుంబం పట్ల సానుభూతి కూడా చూపిస్తారు. ఎందుకంటే కొనుక్కోలేనిది ఈ సృష్టిలో ప్రాణం ఒక్కటే.అందుకే అది అమూల్యమైనది. కానీ అదే మరణం ఓ పేరున్న వ్యక్తికి సంభవిస్తే ఆ ప్రాణానికి ఉండే విలువ ఇంకా అమూల్యమైనది,అనామకుల ప్రాణాల విలువ లెక్కలోనిది కాదు కూడా. అటువంటి ఓ హత్య ప్రయత్నాన్ని సమాజం,వ్యవస్థలు,వ్యక్తులు ఎలా వాడుకున్నారో స్పష్టం చేస్తూ మానవ మూలాల్లో ఉండే బ్రతకనేర్చినతనం ఏ మేరకు సమాజపు పునాదుల్లోకి విస్తరించిందో తెలియజేస్తూ వచ్చినదే పాతాల్ లోక్ సీజన్ -1. ఇది తెహల్కా తరుణ్ తేజ్ పాల్ రాసిన ద స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్ అనే పుస్తకం ఆధారంగా కొంత మేరకు ఉన్నా, పూర్తిగా అదే అని స్పష్టం చేయలేము. అనుష్కా శర్మ ప్రొడక్షన్ కంపెనీ అయిన క్లీన్ స్లేట్ ప్రొడ్యూస్ చేసిన సిరీస్ ఇది. ఇది ఎంతో ప్రేక్షాదరణ పొంది ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లతో నిర్మించబడింది పాతాల్ లోక్.

          విశాల్ త్యాగి,కబీర్ ,మేరీ,తోప్ సింగ్ అనే నలుగురు ఓ హోటల్ నుండి కారులో ప్రయాణిస్తూ ఉండగా వారు సంజీవ్ మెహ్రా అనే టాప్ జర్నలిస్ట్ ను హత్య చెయ్యబోతున్నారనే అభియోగం మీద డిసిపి భగత్ అరెస్ట్ చేస్తాడు.వారిలో తోప్ సింగ్ తన ఫోన్ ను నదిలోకి విసిరేస్తాడు.  ఈ లోపు జర్నలిస్టులు కూడా రావడంతో  వారిని ఆ ప్రాంతపు పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన హతి రామ్ చౌదరికి అప్పగిస్తారు.హతి రామ్ చౌదరి 15 ఏళ్ల నుండి అదే పోస్టులో ఉన్నాడు.అతనికి ఆ కేసు అప్పగిస్తాడు డిసిపి భగత్. హతి రామ్ కు తనను తాను నిరూపించుకోవడానికి ఉన్న ఒకే కేసు అది అని నిర్ణయించుకుని దానిని ఎలా అయినా ఛేదించాలి అనుకుంటాడు. అన్సారి అనే జూనియర్ ఆఫీసర్ తో కలిసి హతి రామ్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఇక సంజీవ్ మెహ్రాకు ఆ కంపెనీ బాస్ కు పడకపోవడం వల్ల అతన్ని రిజైన్ చేయమని చెప్తాడు. సంజీవ్ భార్య డాలి కి యాంగ్జైటీ ఉంటుంది. ఆ నాలుగురు గురించి క్రిమినల్ రికార్డ్స్ చెక్ చేసినప్పుడు త్యాగి అప్పటికే 45 మర్డర్లు చేశాడని,కానీ అతని హత్యలు నిరూపించబడలేదని తెలుస్తుంది.           ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ నలుగురు ఒకరికొకరు అపరిచితులని,కేవలం ఆ హత్య కోసమే కలిశారని అర్ధమవుతుంది. దీనితో పాటు వాళ్ళున్న హోటల్ లో అతను చెప్పిన విషయం ప్రకారం త్యాగి ఎవరో మాస్టర్ జీ తో మాట్లాడితే తప్ప తను ఆ పని చేయనని ఫోన్లో ఎవరితోనో అన్నాడని తెలుస్తుంది. ఆ నలుగురు నుండి ఎంత ప్రయత్నించినా సమాచారం అయితే రాదు. అయితే వీరిలో కబీర్ హతి రామ్ కు తారిక్ అనే అతను తనను ఆ కార్ డ్రైవ్ చేయమని చెప్పాడని,అంతకు మించి తనకు ఏం తెలియదని చెప్తాడు. తారిక్ ను పట్టుకునే ప్రయత్నం చేసినా అతను తప్పించుకుంటాడు. త్యాగి ఉండే చిత్రకూట్ కు వెళితే అతని గురించి అసలు విషయాలు తెలుస్తాయని అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు హతిరామ్. సంజీవ్ మెహ్రా తన దగ్గర పని చేసే సారా తో సంబంధం పెట్టుకుంటాడు. సంజీవ్ ను స్టేషన్ కు పిలిపించి ఆ నలుగురిని చూపించి అతనికి ఏమైనా వారి గురించి తెలుసెమోనని అడుగుతాడు హతి రామ్.తనకు ఏం తెలియదని చెప్తాడు సంజీవ్.తోప్ సింగ్ విసిరేసిన ఫోన్ సెర్చ్ టీం కు దొరుకుతుంది.

          హతి రామ్ త్యాగి గురించి తెలుసుకోవడానికి చిత్రకూట్, అన్సారీ టాప్ సింగ్ గురించి తెలుసుకోవడానికి పంజాబ్ వెళ్తారు. త్యాగి తండ్రికి,అతని అన్నకు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. వాటి విషయంలో తమ్ముడి నోరు మూయించడానికి అతని కూతుళ్ళను రేప్ చేయిస్తాడు వారి పెదనాన్న. తన తోబుట్టువులకు జరిగిన అన్యాయం చూసి రగిలిపోయిన త్యాగి పెద్దనాన్న కొడుకులైన ముగ్గురిని హత్య చేస్తాడు. ఈ విషయం త్యాగి స్పొర్ట్స్ మాస్టర్ నుండి తెలుసుకుంటాడు హతి రామ్.దానితో పాటు అక్కడ ఉన్న  అమితోష్ అనే జర్నలిస్ట్ ద్వారా గ్వాలా గుజ్జర్ అనే రాజకీయ నాయకుడి హస్తం అక్కడి ప్రతి విషయంలో ఉంటుందని కూడా అతను తెలుసుకుంటాడు.  ఇకపోతే తోప్  సింగ్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన అన్సారికి కూడా అతని గురించి తెలుస్తుంది. తోప్ సింగ్ నిమ్న కులంలో జన్మించడంలో అగ్రకులాల ఆధిపత్యంలో బ్రతకాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ తనను అవమానించి,దాడి చేసే  ప్రయత్నం చేసినప్పుడు తోప్ సింగ్ ఓ అగ్ర వర్ణపు యువకుడిని గాయపరుస్తాడు.ఆ  విషయం తెలిసిన తోప్ సింగ్ బాబాయి అతన్ని అక్కడి నుండి పారిపొమ్మని పంపేస్తాడు. ఆ తర్వాత తోప్ సింగ్ తండ్రిని ఆ అగ్ర వర్ణపు యువకుడి తండ్రి హత్య చేసి, తోప్ సింగ్ తల్లిని  సామూహిక అత్యాచారం చేస్తారు. అదే సమయంలో సంజీవ్ సారా ద్వారా త్యాగి గురించి తెలుసుకున్న విషయాలను తన ఛానల్ లో ప్రసారం చేస్తాడు. తన మీద జరగబోయిన హత్య ప్రయత్నాన్ని వాడుకుని తన ఉద్యోగం,కీర్తి నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు సంజీవ్.

          సంజీవ్ ఇదే అదనుగా భావించి ఆ ఛానల్ ను కొనాలని ప్రయత్నిస్తున్న ఇంకో వ్యక్తితో కలిసి మొత్తానికి ఆ ఛానల్ టెక్ ఓవర్ చేసుకుంటాడు. ఫోరెన్సిక్ టీం తోప్ సింగ్ ఫోన్లో సంజీవ్ ఫోటోలు,అతని వీడియోలు కనుగొంటారు. దానితో పాటు తోప్ సింగ్ చందా అనే అమ్మాయితో ఉన్న ఫోటోలు కూడా దానిలో ఉంటాయి. మేరీ అమ్మాయి కాదని ట్రాన్స్ జెండర్ అన్న విషయం తెలుస్తుంది. మేరిని  స్త్రీల సెల్ నుండి పురుషుల సెల్ కు మారుస్తారు. అన్సారి ఐఏఎస్ మెయిన్స్ క్లియర్ చేస్తాడు.మేరి అసలు పేరు చీని అని కూడా తెలుస్తుంది. చీనికి ఆ పని అప్పగించిన  ముఖేష్ దగ్గరకు వెళ్ళిన ప్రయోజనం ఉండదు. చీని ట్రాన్స్ జెండర్ అన్న విషయం కూడా మీడియాకు తెలిసిపోవడం,కేసుకు సంబంధించిన విషయాలు బయటకు రావడంతో హతి రామ్ ను సస్పెండ్ చేసి, ఆ కేసును సి.బి.ఐ కు అప్పగిస్తారు.

          హతి రామ్ డిసిపి భగత్ ను కలిసి ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తానని అడిగినా ప్రయోజనం ఉండదు. సి.బి.ఐ ఇదంతా ఐ.ఎస్.ఐ ప్లాన్ అని,కబీర్  పాకిస్తాన్ అండర్ కవర్ అని,అతని దగ్గర జిహాద్ లిటరేచర్ ఉందని,ఇదంతా భారత దేశంలో రాజకీయ అస్థిరత కోసం చేస్తున్న విద్రోహ చర్యలని ప్రకటిస్తుంది. సి బి ఐ అధికారులు ఈ విషయాన్ని ముందే రాజీవ్ కు చెప్పడం,దానిని అతను తన ఛానల్ లో ప్రసారం చేసి తన పాపులారిటీ పెంచుకోవడానికి చేయడం జరుగుతుంది.కానీ కబీర్ కు ఉర్దు రాయడం రాదని అన్సారికి తాను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలుస్తుంది.కానీ సి.బి.ఐ ప్రకటించిన ఆ లిటరేచర్ లో కబీర్ సంతకం ఉర్దూలో ఉండటం చూసిన హతి రామ్,అన్సారీలకు ఇదంతా ఓ సెటప్ అని అర్ధమవుతుంది.

          సి.బి.ఐ ఇన్వెస్టిగేషన్ లో నిజాలు లేవని గ్రహించిన హతి రామ్,అన్సారీ వ్యక్తిగతంగా మళ్ళీ ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. కబీర్ ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ అతని అన్నను మత గొడవల్లో హత్య చేయడంతో అతన్ని ముస్లిం అనే విషయం కూడా తెలియజేయకుండా పెంచుతారు.అలాగే చీని చిన్నప్పటి నుండి అనాధగా ఓ రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద పెరిగింది.ఎలాగో షాప్ స్టోర్ లో ఉద్యోగం చేసుకుంటూ,ప్రైవేట్ గా మసాజ్ పార్లర్ లో కూడా చేస్తూ ఉంది అనే విషయం కూడా స్పష్టం అవుతుంది. ఈ లోపు కబీర్ ను సెల్ లోనే హత్య చేస్తారు.

          త్యాగి స్పోర్ట్స్ మాస్టర్ కు చిత్రకూట్ రాజకీయ నాయకుడు బాజ్ పై తో సంబంధం ఉందని,అంతే కాకుండా అంతకు ముందు అతను పోలీస్ కూడా అని పాత పేపర్ కటింగ్ల ద్వారా తెలుసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న హతిరామ్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి చిత్రకూట్ బయల్దేరతాడు. హతి రామ్  త్యాగి స్పోర్ట్స్ మాస్టర్ పోలీసుగా ఉన్నప్పుడూ ఆ ప్రాంతపు బందిపోటు మరియు ఆ ప్రాంతం వారు దేవుడిగా కూడా కొలిచే డోనిల్లా దగ్గర పని చేసే వాడని,తర్వాత అతని వల్లే స్పోర్ట్స్ మాస్టర్ అయ్యి, ఆ స్కూల్ లో వారిని అతని ఏజెంట్స్ గా మారడానికి సహకరించేవాడని చెప్తాడు.త్యాగి ఆ ముగ్గుర్ని హత్య చేశాక అతన్ని అతని బాబాయి నుండి కాపాడడానికి అతన్ని డోనిల్లా దగ్గరకు తీసుకువెళ్తాడు స్పోర్ట్స్ మాస్టర్. డోనిల్లాకు అతి నమ్మకస్థుడిగా మారతాడు త్యాగి.

          త్యాగి డోనిల్లానే మాస్టర్ జి అని సంబోధించేవాడని  హతి రామ్ కు అర్ధమవుతుంది. డోనిల్లా సోదరుడు గ్వాలా గుజ్జర్. టాప్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే అతని ఫోన్ వీడియోల్లో ఉందో ఆమెను బాజ్ పై సెక్రటరీ శుక్లాతో చూస్తాడు హతి రామ్. తోప్ సింగ్ ఆమెను ప్రేమించాడని,కానీ సైకోగా ప్రవర్తించేవాడని,అతన్ని తనను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని శుక్లాను అడిగితే అతన్ని ఢిల్లీ ఓ అసైన్మెంట్ మీద పంపారని ఆమె చెప్తుంది. ఇక పోతే డోనిల్లా  అనారోగ్యంతో మరణిస్తాడు. అయితే తాను రాజకీయాల్లో ప్రవేశించాలని ఆశయంతో ఉన్న గ్వాలా ఆ విషయాన్ని దాచిపెడతాడు.అదే విషయం తెలిసిన బాజ్ పై అప్పటి వరకు వారితో కలిసి పని చేసిన ఇక వారి అవసరం లేకుండా సొంతంగా ఎదగాలనుకుంటాడు.అలాగే గ్వాలా కూడా తన సొంత పార్టీ ద్వారా ఎదగాలనుకుని,ఇంకో పార్టీ స్థాపిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న  బాజ్ పై వారి టీం లో ఉన్న వారిలో త్యాగి ఉండగా వారిని అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించి అతన్ని చంపే ప్లాన్ లో భాగంగానే ఎవరికి అనుమానం రాకుండా డి.సి.పి తో కలిసి త్యాగితో ఇంకో ముగ్గుర్ని కూడా చేర్చి వారు ఏదో హత్య చేస్తున్నారనే వంకతో వారిని ఫెక్ ఎన్ కౌంటర్ ద్వారా హతమార్చాలనుకుంటాడు.కానీ అదే సమయంలో మీడియా రావడం వల్ల వారిని హత్య చేయకుండా పోలీసులకు అప్పగిస్తాడు.

          కానీ సంజీవ్ మెహ్రా భార్య కుక్కల్ని ఎంతో ప్రేమించడం చూసిన త్యాగి కుక్కల్ని ప్రేమించేవారిని మంచి వారని నమ్మడం వల్ల తాను మాస్టర్ జీ తో మాట్లాడితే తప్ప ఆ హత్య చేయనని చెప్పి వెనక్కి వెళ్లిపోతున్నప్పుడు వారిని పోలీసులు పట్టుకుంటారు.ఇదంతా త్యాగిని హత్య చేయడానికి చేసిన స్కెచ్ అని హతి రామ్ కు అర్ధమవుతుంది. తానైతే సాల్వ్ చేయలేనని భావించే తనకు అప్పగించారని,తాను సాల్వ్ చేసే సమయంలో అందుకే తనను సస్పెండ్ చేశారని అర్ధం చేసుకుంటాడు హతిరామ్.

          నిజాలు తెలుసుకున్న హతి రామ్ తిరిగి వస్తాడు.సంజీవ్ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి,అతను దాన్ని తన పాపులారిటీ కోసం ఎలా వాడుకున్నాడో కూడా చెప్పి వెళ్ళిపోతాడు. మాస్టర్ జీ మరణించాడని తెలుసుకున్న త్యాగి కోర్టులో గన్ తో పేల్చుకుని చచ్చిపోతాడు. ఆ న్యూస్ ని కూడా సంజీవ్ తనకు అనుకూలంగా మార్చుకుని తన పాపులారిటీ పెంచుకుంటాడు.

          తమ పాపులారిటీ కోసం ఫేక్ న్యూస్ ని  లేదంటే న్యూస్ ని సృష్టించి మరి వాడుకునే మీడియా, దేశపు మూలాల్లో ఉన్న మత కలహాలు, హింస,అవినీతి ఇలా ఎన్నో ఈ సిరీస్ లో స్పష్టం అవుతాయి. ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్న ఈ సీజన్ ను తప్పకుండా చూడాల్సిందే.

                         *    *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ