నేనేమనుకుంటానంటే ....
నేనేమనుకుంటానంటే ....
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
(పార్ట్
-2 )
1)బాధలు మనిషికి
అనివార్యం.అందరితో చెప్పుకోలేని విషయాలను మనతో మనమే పంచుకుంటుంటే ఆ భారాన్ని
తీసుకునేవే కన్నీళ్ళు.కన్నీళ్ళు మనిషి బలహీనత కాదు,సున్నిత
స్పందన.
2)ఉదృతి పెరిగితేనే ప్రభావ స్థాయి
పెరుగుతుంది.చిన్న చిన్నవి గుర్తించలేని దశలో ఉన్న ఉద్యమాలు,వ్యక్తిగత
ప్రతిభలు సైతం ఆ గుర్తింపు స్థాయికి వచ్చేసరికి ఉదృతమవుతాయి.కానీ ఆ ఉదృత స్థాయికి
రావడానికి అది క్షణకాల చర్య కాదు,గాఢత చేకూరడానికి అవసరమైన
సంపత్తి.
3)జీవితంలోని సాధారణమైన అనుభూతుల్ని,అనుభవాల్ని అసాధారణమైన అంశాలుగా వీక్షించి,దానిని కాలం సైతం తన డైరీలో భద్రపరుచుకునేలా జీవిస్తే కాలం సైతం మనల్ని
గుర్తుంచుకుంటుంది.మనకంటూ ఉన్న వైవిధ్యాలను,ప్రత్యేకతలను
గుర్తిస్తూ,వాటిని గమనిస్తూ,వాటి పట్ల
పరిశీలకులుగా-పరిశోధకులుగా ఉంటేనే మనదన్న ఉనికి నిలిచిపోతుంది.
4) మనల్ని మనం
నమ్మడం అనేది జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం.కానీ ఈ అంశం మీద ఎన్నో
ప్రభావాలు ఉంటాయి.సమాజంలో ఉన్న అందరి శక్తులు చూసి వారితో పోల్చుకోవడం,అందరి
స్థాయిలతో మన స్థాయిని సరితూచడం వల్ల మనమేంటో,మన శక్తి ఏమిటో
తెలుసుకోవాలనే సంకల్పం కన్నా మనకు ప్రవేశం,ప్రతిభ లేని
వాటన్నింటిని ఈ సమాజపు పోటీ ప్రపంచంలో పోల్చుకుంటూ ఒక్కోసారి న్యూనతకు గురవతూ ఉంటాము.మనిషి తాను ప్రత్యేకుడని,తాను చేయగలిగే వాటి గురించి,వృద్ధి పరచుకోవాల్సిన
వాటి మీదే తన శక్తులు కేంద్రీకరించి,తనను తాను విశ్వసించాలి.
5) వాట్సప్ సాహితీ బృందాలు : ఏ
బృందంలో నైనా సరే కవులు,రచయితలు తమ రచనలు పంచుకోవాలని,వాటిపై స్పందనలు రావాలని ఆశించడం సహజం.బృందాల్లో వచ్చే ఓ సమస్యేమేటంటే
రోజు రచనలు పంచేవారికి రచనలపై ఒకరు స్పందించడం,తరువాత
ఇంకొకరు స్పందించడం ...అలా జరుగుతూ ఉంటుంది.అప్పుడప్పుడూ పెట్టేసరికి
కొత్తవారవ్వడం వల్ల ఒకరో,ఇద్దరో ముందుకొచ్చి స్పందిస్తే,మిగిలిన వారు స్పందిస్తారు.ఇవి సాధారణమైన అంశాలే.బృందమంటేనే ఆ కొత్తదనం
నుండి పాతదనానికి పయనించడం.సాహితీవేత్త ముందు చొరవతో తన రచనలు రోజూ పంచుకోగలిగితే
అప్పుడు ఆ సాహితీవేత్త బృందంలో చురుకైన సభ్యుడవుతాడు.కాకపోతే కొందరే రోజు పెట్టడం
వల్ల ,ఇంకొందరు మనం కొత్తవారమనే బెరుకుతో ఉండిపోతే ఎప్పటికీ
ఆ బెరుకు అలానే ఉండిపోతుంది.ఇన్ని అంశాలు ప్రతి రంగంలోనూ జరుగుతూనే ఉంటాయి.మనం
సహజంగానే అలా ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని భావించడం,మనకు
ఉండదని అనుకోవడం జరుగుతుంది.కానీ అందరూ ప్రయత్నించి వీలున్నప్పుడు మీ రచనలు
పంచుకుని,ఓ నాలుగు రచనలు దాటాక కూడా ఒక్క స్పందన రాలేదంటే,అప్పుడు మీరు బహిరంగంగా ప్రశ్నించి,స్పష్టత
తెచ్చుకోవడం మంచిది.అలా అడగటానికి సిద్ధపడినప్పుడు తోటి సాహితీవేత్తలు సూచనలు
ఇచ్చినప్పుడు హుందాగా స్వీకరించే గుణాన్ని కలిగి ఉండాలి.ఈ అస్పష్టతల వల్లే
రాజకీయాలు బృందాల్లో తలెత్తుతాయి.వాటికి ఇక్కడ ఆస్కారం లేకుండా చూసుకుందాం.వీలైనంత
స్పష్టత ఉన్నప్పుడూ ఏ రాజకీయం తలెత్తదు.
6) మార్పు అన్నది
అనివార్యం.అది 'పరిస్థితులు-ప్రభావం-ప్రగతి'ఆధారంగా
పయనం చేస్తూ ఉండాల్సిందే.ముఖ్యంగా సాంస్కృతిక మార్పులను గమనించడం,గుర్తించడం,అవగాహన కలిగేలా చేయడం వల్ల దేశ సంస్కృతి
పట్ల ఉన్న ఛాందస భావాలు తొలగిపోయి,మార్పు-సంస్కృతి పట్ల ఉన్న
సంబంధం స్పష్టమవుతుంది.
7) మన జీవితంలో
ఎన్నోసార్లు మనం వేసుకున్న ప్రణాళికలు,పయనించిన మార్గాలు
హఠాత్తుగా అగమ్యగోచరంగా మారి,కొత్తదారులు ఏర్పాటు
చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.వ్యక్తి-సమాజం-దేశం ఏ స్థాయి అయినా సరే ఉన్న
స్వేచ్ఛ,జీవితం అన్ని తారుమారయినా మనం పయనించిన జీవితానుభవం
మాత్రం ఏ పరిస్థితినైనా ఎదుర్కొని అనుభవ యెరుకతో మళ్ళీ మొదలుపెట్టే అవకాశాన్ని
ఇస్తుంది.
8) జీవితంలో ఏ
తలుపును తెరవాలో,ఏ తలుపును మూయాలో మన అభిరుచులు,వ్యక్తిగత పరిస్థితులు,ప్రభావాల మీదే ఆధారపడి
ఉంటుంది.మంచి పుస్తకం,మంచి ప్రదేశ వీక్షణం,ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న తపన మిళితం కానీ జీవితమెందుకు?
మనమంటే
సమాజం నిర్మించే మట్టి ముద్దలం కాదు,గానుగెద్దు ప్రక్రియల్లో
మనకు ఇష్టమైనవాటిని లాభం-నష్టం తూకాల మధ్య వదిలిస్తే,జీవించిన
పరిమళం మన వరకు కూడా లోపలి నుండి బయటకు రాదు.మనకు నచ్చేది కొన్నిసార్లు
తెలియనప్పుడు కొత్త తలుపులు తెరుచుకుంటూ పోవడమే.జీవితంలో ఆ 'ఓపెన్
నెస్ 'మొదలవ్వాల్సిందే.
9) నేడు ఎండ పెరిగిపోవడానికి
అడవుల తగ్గుదల,మాంసాహార వినియోగం,ఆహార పదార్ధాల
వినియోగంలో వచ్చిన మార్పులు ఓ కోణమైతే. ఈ వేడిని తట్టుకోవడానికి మనం ఇంట్లో
వినియోగించే ఎయిర్ కండిషనింగులు,రిఫ్రిజిరేటర్ లు కూడా
గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తికి తోడ్పడటం కూడా ఇంకో కారణం. వీటితో పాటు ప్రపంచ
వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక మాఫియా వల్ల
కూడా నది జలాల్లో ఉండే ఇసుక లోపించడం వల్ల
వాన నీటిని భద్రపరిచే సామర్ధ్యం కూడా నేల కోల్పోవడం, వ్యవసాయానికి
నీటి బోరులు నేడు ఐదు వందల అడుగులు తవ్వినా పడని పరిస్థితులు ఏర్పడటం కూడా
భూఉష్ణోగ్రత మీద ప్రభావం చూపుతుంది. ఒక సెంటీమీటరు మేర ఇసుక ఏర్పడాలంటే కనీసం 30
సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. వర్షాలు,వరదలు
వచ్చినప్పటికీ భూమిలోకి నీళ్ళు ఇంకడానికి ఇసుక నేలలు, నదీ
పరీవాహక ప్రాంతాలే కీలకం. ఇసుక ద్వారానే 15-20 శాతం నీళ్ళు భూమిలోకి ఇంకుతాయి.
మట్టి నేలల్లోకి ఇంకే నీరు 3-4 శాతం మాత్రమే.
మనకు కనిపించేవి ఎలా భూమిని ప్రభావితం చేస్తున్నాయో, కనబడని
ఎన్నో చర్యలు కూడా భూమిని అతలాకుతలం చేస్తూ పర్యావరణ విధ్వంసానికి
కారణాలవుతున్నాయి.
10) జ్ఞాపకాలు
కదిలిపోయిన కథలే కాదు,తలచుకున్నప్పుడే ప్రత్యక్షమయ్యే అందమైన కలలు
కూడా.ఆ ఇల్లు-అరుగు అదృశ్యమైనా అవి సాక్షీభూతమై ఎన్నో సన్నివేశాలన్ని,ఎందరో మనుషుల్ని,ఎన్నో పరిస్థితులను మన జీవితంలో ఓ
భాగం చేస్తూ మనదైన ప్రత్యేక అనుభూతి-అనుభవ సంపదను సొంతం అయ్యేలా చేస్తుంది.ఊహించని
నుండి సహజంగా మారిన మార్పులు కాలం గడిచే కొద్ది మన దృక్కోణాన్ని మార్చేస్తాయి.అవి
తలచుకోవడానికి లేకపోయినా దానితో ఉన్న అనుభవమే నేడు గొప్పగా పరిగణించాల్సిన
అంశమేమో!
11) ఈ ప్రపంచంలో
అన్నిటికన్నా ప్రమాదకరమైనది త్వరగా
ప్రభావితమయ్యే మనసు.ఆ విపరీత ప్రభావమే మూఢత్వంగా మారి,విధ్వంసకర్తలను
సృష్టిస్తుంది.మనసులో చెత్త పేరుకుపోవాలంటే అది ఆ ప్రభావంలో పుట్టాలి లేదా
పెరగాలి.అది మంచైనా,చెడైనా కూడా ప్రమాదమే.ఎందుకంటే అందరికి
ఒకే జీవన గమనం,లక్ష్యం,తృప్తి,సంతోషం ఉండవు కనుక.ప్రభావితమవ్వని మనసును పెంచగలిగితే మనుషుల ఆలోచనల్లో
హేతుబద్ధత,కారణం స్పష్టమవుతాయి.
12) జీవితంలో ప్రతి
దశలో పరీక్షలు సహజం.విద్యలో పరీక్ష
భవిష్యత్తు పట్ల అభద్రతను,వివాహంలో పరీక్ష సమాజం-కుటుంబంలో అభద్రతను,పరిస్థితుల పరీక్షలు బ్రతుకు పట్ల అభద్రతను మొదట సృష్టిస్తాయి.వాటిల్లో
గెలుపు,ఓటములు ఉండవు వాస్తవానికి.ఆ తెరను సృష్టించి,దానిని ఆ అభద్రతలకు మూలంగా చేసేది మనమే.మన ఆలోచనల్లో దాని పట్ల సానుకూలతే
ఓ పరీక్ష.
13) ఏది నిజమో,ఏది
ఇజమో తెలుసుకోలేనన్ని మార్పులు వ్యక్తి-సమాజ-దేశ స్థాయిల్లో జరిగిపోతూ ఉంటే,ఏది నిజమనే ప్రశ్నకు సమాధానం 'మన అభిప్రాయాలు-మన
అవగాహనలు' అయినా,వాటిలో ఏర్పడే
వైరుధ్యాలను ఐక్యం చేసేది మాత్రం 'భిన్నత్వంలో ఏకత్వ'
స్ఫూర్తిని నిలుపుకోవడమే.
14) పొరపాటు చేయడం
సహజమే అయినా,పొరపాటైందని ఒప్పుకొనే స్వభావాన్ని ఆ పొరపాటు
నేర్పించకపోతే ఆ పొరపాటు మనకు ఏం నేర్పించనట్టే.
15) స్త్రీలో అసూయ,అనుమానం
ఎక్కువనేది కొన్నిసార్లు నిజమైనదే.కానీ ఒకే స్త్రీ కొత్త వాతావరణంలో కొత్త
కుటుంబంతో కలిసిపోగానే ఆ కుటుంబంతో తాను జీవితాంతం ఉండాలనే భావనతో ప్రేమ,ఎంతైనా తాను పరాయిదన్న భావన వల్ల అనుమానం-అసూయలు జనించవచ్చు.పరిస్థితులకు
తగ్గట్టు స్పందించడం మానవ సహజం.అంగీకారం ఇరువైపులా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే
నమ్మకం-భద్రతా స్త్రీలో ఏర్పడతాయి.స్త్రీలైనా,పురుషులైనా ఆ
రెండు కొరవడితేనే అనుమానాలకు,అసూయకు దారిస్తారు.ఇది
చర్య-ప్రతిచర్య ఆధారితమే.కానీ అది ఏ పరిస్థితి అయినా స్త్రీ తన మనుగడ
సాగించాల్సిందే.నేటి ఆధునిక సమాజంలో పోలికలు,అసంతృప్తులు
కూడా ఆమెకు ప్రమాదకరమే.ఇవన్నీ అంతర్గత యుద్ధాలే.
16) ప్రపంచంలో
వ్యక్తి-వ్యవస్థలు రెండు కరువు బారిన పడ్డాయి.ప్రేమ-అనుబంధం వ్యక్తి స్థాయి అయితే
వ్యవస్థ స్థాయిలో కనీస అవసరాలైన తిండి,గుడ్డ,నేల విషయాల్లో కరువు.ఆధునికత పై మోజు,ప్రపంచీకరణ,ఉత్పత్తుల వెల్లువలు పెరిగేకొద్దీ సూక్ష్మంగా అన్ని స్థాయిలను ప్రభావితం
చేయడం కూడా 'కరువు'కి ముడి సరుకులుగా
మారాయి.
17 ) మతాలు-మూఢ
విశ్వాసాలు,పవిత్రత-అపవిత్రత,కులాలు వీటి
ఆధారంగా ఆలోచించేవారు సైన్స్,చరిత్రలను తెలుసుకుని సమగ్ర
ఆలోచనా చింతనను అలవర్చుకుంటే సమాజపు మూఢకూడ్యాలు ధ్వంసమవుతాయేమో!జన్యు శాస్త్రం ఈ
రెండు శాస్త్రాలకు గొప్ప ఆలంబన.
18) విద్య ఉన్నవాడు
అన్నిచోటలా గౌరవింపబడతాడో,లేదో కానీ ఆ విద్యను డబ్బుగా మార్చగల లౌక్యం
ఏ పరిస్థితుల్లోనైనా అలవడితే తప్ప విద్యావేత్తలు మనలేని ప్రపంచంగా
తయారవుతుంది.కానీ విద్య ప్రసాదించిన
ఆత్మాభిమానం,సంస్కారం,విలువలు
వారి ఆత్మబలాన్ని సూచిస్తున్న మనుగడ ముప్పులు ఎదుర్కోవాల్సిందే.
19 ) వైరుధ్యాలను
సర్ది పుచ్చుతూ, అనుకూలంగా మార్చుకుంటూ,వ్యూహాలు-ప్రతివ్యూహాలు
పన్నుతూ ముందుకు సాగే రంగమే రాజకీయం.
20) సమాజంలో దారుల
మీద దారులు వేస్తూనే ఉంటారు.మొదట ప్రజాస్వామ్యంగా మొదలయ్యే ఆ పయనం అటు తరువాత
నియంతృత్వంగా మారుతుంది.దాని ప్రతిపక్ష దారిది అదే తోవ.ఆ పరిస్థితుల్లో పౌరులు 'అడ
కత్తెరలో పోక చెక్క'లా నలిగిపోతుంటారు.ఆ మధ్య మార్గాన్ని
అన్వేషించడం,వెతకడమే అసలైన మేధావి చేసేది.
21 ) ప్రతి మనిషిలోనూ
బలాలు-బలహీనతలు రెండు ఉంటాయి.బలాలను భజన చేయడమే కాకుండా,బలహీనతలను
అధిగమించాలని కూడా గుర్తు చేయాలి.అది సాహితీ ప్రయోజనమే.ఎన్నో సార్లు ఎన్నో
చేయాలనుకుని కూడా కాలక్షేపపు కార్యక్రమాల్లో మునుగుతూ,చేయాల్సిన
వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాము.
22) మనం ఏ
ప్రభావానికైనా తలొగ్గామంటే దానికి కారణం అంతరంగంలో ఎక్కడో మనకు ఆ భావనల పట్ల ఇష్టం
ఉండటమే.దానిని బహిరంగంగా వ్యతిరేకించినా,అంతర్ముఖంగా దాని పట్ల
మక్కువ ఉండటమే మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.
23) చరిత్ర నుండి
చూసే ప్రపంచానికి,వాస్తవ ప్రపంచానికి దృష్టిలో వ్యత్యాసం
ఉంటుంది.చరిత్ర రాసే వారు తమకు నచ్చిన కోణం నుండి రాసే అవకాశం ఎక్కువ.సమన్వయపరిచే
దృష్టి తక్కువ.ఒకరు నాయకులైతే,ఇంకొకరు ప్రతినాయకులు.ఇద్దరూ
ఒకే సందర్భంలో తమ పరిస్థితులకనుగుణంగా స్పందిస్తున్నారన్న భావనతో రాసే ఆస్కారం తక్కువ.ఆ
ప్రభావమే పాఠకుల అవగాహన స్థాయిని ప్రభావితం చేస్తుంది.ఆ అవగాహన కోణాన్నే బట్టి
మనుషులు గతం పట్ల అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు.దానిని దాటి మనుషుల
పరిస్థితులు-స్పందనలు,మార్పుపై ప్రభావం అన్న దిశలో
ఆలోచించగలిగితే ప్రగతి కోసం పడే ప్రతి అడుగు విప్లవ స్ఫూర్తికి నిదర్శనమవుతుంది.
24) ప్రేమ అంటే ఏ
భావనకు వర్తిస్తుంది అన్నది నేటికి ఓ సందిగ్ధ అంశంగానే మిగిలింది. వ్యక్తులకు,సంస్థలకు,దేశాలకు,నమ్మకాలకు,మతాలకు,ఋతువులకు-ప్రకృతికి,అందాలకు-కళ్ళకు...ఇలా ప్రేమ
ఎవరికి వర్తించే అంశం అన్నది ఎప్పటికి ప్రశ్నార్థకమే.ఓ గాఢమైన అనూభూతి,వదులుకోలేని బలహీనత,మర్చిపోలేని మానసిక స్థితి అన్ని
ప్రేమ అన్న భావనకే సొంతం.దాని మూలాలను బట్టి దాని ప్రభావాలు మారుతూ ఉంటాయి.అది
మూఢత్వం నుండి జన్మిస్తే ద్రోహంగా,మారణకాండగా,ద్వేషంగా కూడా మారుతుంది.ప్రేమించడం అంటే వ్యక్తపరచగలిగేదే అనే భావన ఇంకో
వైపు....ఇలా గందరగోళ భావనల మధ్య ఉండేదే ప్రేమ.
25) వాస్తవానికి
వ్యక్తి స్థాయి వరకు ప్రభావితం చేయని పరిస్థితులని వ్యక్తులు ప్రాధాన్యత ఉన్న
అంశాలుగా కాక, వార్తాంశాలుగా భావిస్తారు.తమ వృత్తి లేదా ప్రవృత్తిలో
అల్లకల్లోలం సృష్టించేవరకు ఎవరు ఏ ఘటన ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని
ప్రయత్నించరు.పేద-మధ్యతరగతి వారికి కడుపు నిండడం సమస్యలైతే,ధనికులకు
తమ స్థాయిని-కీర్తిని పోషించుకునే ప్రకృతి ఉంటుంది.ప్రతి స్థాయి ప్రభావితం అయితేనే
స్పందించే సంస్కృతి మనది.ఆపాటికి పరిస్థితి అదుపు తప్పుతుంది.ఇక ఈ పరిస్థితులు
వ్యాపార పెట్టుబడులు ఇంకొందరికి.ఆ పెట్టుబడి ఎటు వైపు లాభాన్నిస్తుందో తేల్చుకోవడం
వారి బ్రతుకుతెరువు.ఇదో విచిత్ర సమాజ వలయం.
26) స్త్రీలలో
బహిష్టు పట్ల బహిరంగంగా మాట్లాడే బిడియాన్ని దాటే దశ ఇంకా పూర్తిగా రాలేదు.స్త్రీ
చేసే పనుల్లో ముఖ్యంగా ఆమె వల్ల ఇతరులకు మేలు ఒనగూరినప్పుడే ఆమెను అభినందించడం
జరుగుతుంది.వ్యక్తి స్థాయిలో ఆమె అసౌకర్యాలను మన్నించేవారు,అర్థం
చేసుకునే వారు తక్కువే.ప్రథమంగా స్త్రీలు వాటి గురించి పంచుకోవడానికి ఇష్టపడరు.ఆ
అయిష్టత నుండి ఐచ్ఛిక దశ రావాలంటే ఆ వాతావరణం ఆమెలో మానసికంగా ఏర్పడేలా ఆమె భర్త
లేదా కుటుంబం చేయగలగాలి.ఆడ-మగ భార్యాభర్తలైనా,అన్నా
చెల్లెలైనా,తల్లి కొడుకులైనా,స్నేహితులైనా...బంధమేదైనా
కొన్ని కనపడని దూరాలు ఉండిపోతాయి.దాన్ని పూరించాలంటే భద్రతను మించిన బంధ గాఢత
ఉండాలి.
27) వాస్తవం.డబ్బు
గురించి తహతహలాడేవారిని కొన్ని సార్లు ఏవగించుకున్నా,జీవితంలో
కొన్ని సార్లు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బు గురించి
అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి.పరిస్థితులని బట్టి అభిప్రాయాలు మారకపోవడం కొన్ని
సార్లు మూర్ఖత్వం,మన లోపాలను ఒప్పుకోలేనితనం కూడా.బహుశా ఈ
సంఘర్షణే మధ్య తరగతి చిద్విలాసం.
28) తాము అనుభవించే
జీవితానికి పై మెట్టున ఉండే జీవితం వైపు మనిషి చూడటమే మనిషిలో విజయ కాంక్షను
గుర్తు చేసే అంశం.కిందికి చూస్తే దానిని అపజయపు ఆలోచనలుగా భావించే ధోరణి
ఉంది.మనిషి ఆలోచనల్లో విజయ సమరం మొదలవుతున్నప్పుడే,ఇక దేన్ని
పట్టించుకోలేని నిర్లిప్తత ఏర్పడుతుంది.నచ్చని వాటిని,తాము
ఆస్వాదించలేని వాటి గురించి ఆలోచించడమే దండగ కొందరికి.
29) ఏదీ శాశ్వతం కాదు,అశాశ్వతం
కూడా కాదు.దశల వారీగా మారుతూ ఉంటాయి.అదే జీవితం.వివిధ దశల్లో వైరుధ్యాలకు అలవాటు
పడటం,అంగీకరించగలగడమే జీవితం.
30) మనిషి బలహీనత
క్రమంగా వర్గ బలహీనతగా మారుతుంది.వ్యక్తిగా ఉన్నప్పుడూ బలహీనత అయినా బలమైనా స్వరం
బలహీనమే.అది వర్గ లక్షణంగా మారినప్పుడే దానిని తమ ప్రత్యమ్నాయ శక్తిగా కొందరు మార్చుకోగలరు.ఈ పరిణామం దశలను గుర్తించడానికి
ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఓ దౌర్జన్య
వర్గం రూపొందుతుంది.ఏ పెత్తందారీ వ్యవస్థ ఒక్క రోజులో పుట్టలేదు.ఆ దశలను గుర్తించే
స్పృహ ఇతరులలో లేకుండా వారిని ఆపాటికే బందీలను చేయడం వల్ల జన్మించినదే.
31) మనిషికి తాను
మేధాపరంగా ఎవరికన్నా తక్కువ కానన్న భావాన్ని నిరూపించుకోవడానికి,తన
ఆధిక్యతను స్పష్టం చేసే ప్రయత్నంలో ఇగో అహంకారంగా పరిణామం చెందుతుంది.
32) మనిషే ఓ ప్రపంచం,మనిషే
ఓ దీవి కూడా.సన్నిహిత మనిషిలోనూ మనకందని దీవి లాంటి ప్రపంచం ఇంకోటి ఉంటుంది.ఆ
వ్యక్తిని ప్రపంచ దృష్టి నుండి చూస్తూ దీవిని చూడలేకపోతే అది ఎప్పటికి చిక్కు
విప్పుకోలేని ముడే.తాకిన స్పర్శానుభూతో,పొందిన తన్మయమో ఆ
దీవిలోని రహస్యాలను ఛేదించే అనూభూతినిస్తుంది.
33) ప్రతీ అంశాన్ని
రోజు క్రమం తప్పకుండా పెరిగే వాతావరణంలో సృష్టిస్తూనే ఉండాలి.అది భావ సంపద అయినా,పదార్థమైనా
ఏదైనా సరే.ఎందుకంటే దాని ప్రభావం అది లేని చోటున కూడా తన నీడను విస్తరించగల
పొడుగును కలిగి ఉండాలి.
34) అనుబంధ గాఢత
మెటిరియలిజంలో ఉండే అస్తిత్వం ద్వారా కూడా మనసును తాకుతుంది. నాన్న నిర్మించిన
సౌధంలో నాన్న లేని ఆ సౌధం అస్తిత్వాన్ని జ్ఞాపకాలుగా మలచిన ఓ లంకె.ఆ లంకెను చూస్తూ
అది తనలో దాచుకున్న జ్ఞాపకపరిమళాలను స్పృశిస్తే ఆ నాన్నను భావంగా చూసే దృక్కోణం
అలవడుతుంది.
35) ఎవరికి ఏది
క్షేమం కలిగిస్తుందో,ఎవరికి ఆ క్షేమం కలిగించే దాని
దుష్ప్రభావాలను వారు ఎదుటివారి క్షోభల్లో కూడా పెట్టుబడిని కనుగొనగలరో వారి
క్షేమమే ముఖ్యం.జాతి క్షేమం అన్న అంశం ముసుగు అయ్యి ఉండవచ్చు,నిజంలో ఉన్న అబద్ధం అయ్యి ఉండవచ్చు.
36) బాల్యంలో చూసినవి,అనుభూతించినవి
నేడు మన జీవితంలో భాగమైన నాడు వాటిని ఆస్వాదించిన చిత్తము నేడు ఉండదు.
37) చరిత్ర అంటే
శిఖరాన్ని అధిరోహించిన వారి జీవిత కథలే తప్ప వారి మెట్లుగా మారినవారు కాదు.వారి
గురించి అందరికి తరువాత తెలియాలన్న స్పృహ వారిలో ఉండదు.ఆ తపన ఉన్నవారికే ఆ కొన్ని
లిఖిత అక్షరాలు సొంతమవుతాయి.
38) పరిస్థితులు,విశ్వ
ప్రేరేపిత ఘటనలు ప్రపంచంలోని పౌరుల మనసుల్లో ఓ స్పందనా స్థాయిని సృష్టించాలి.కానీ
మనిషి వాటిని చూడాలనుకోనప్పుడు,అవి తన వరకు రానంతవరకు తన
ప్రమేయం ఆలోచనల్లో కూడా అనవసరం అనుకున్నప్పుడు ఆ క్రమంలో అతను అచలిత జీవిగా మారి,ఆ ఉప్పెన అతన్ని తాకినప్పుడు అతనిలో ప్రతిస్పందన తీవ్రత నిర్లిప్త
స్థాయిలో ఉండి మనిషిని వరిదుబ్బును చేస్తుంది.
39) ప్రతి మనిషికి
మరణ భయం ఉంటుంది.ఆ మరణం కూడా వీలైనంత సుఖంగా రావాలనే అందరూ కోరుకుంటారు.అలాగే
జీవించినంతకాలం సంతోషంగా ఆ మరణాన్ని వాయిదా వేస్తూ గడుపుతూ ఉంటారు.కానీ ఆ
మరణసమరానికి తమను తాము సిద్ధం చేసుకుంటూ,ఈ క్షణం తప్ప తరువాతి
క్షణంలో ఉంటుందో లేదో తెలియని సందిగ్ధ యుద్ధ పరిస్థితులతో సహవాసం చేసే జీవనం
సాగించాలంటే ఎంతో ధైర్యంగా ఉండాలి.
40) సాహిత్యం స్థాయి
దానిలోని అంశ మానసిక స్థితి పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. సంఘటనల కన్నా,వాటికి
దారి తీసిన శారీరక,మానసిక స్థితుల నుండి దాని ప్రభావం
మనిషిలోని అంతర్లీన స్థితిని ఎలా ఎదిగేలా చేసిందో సుషుప్త స్థాయిలో స్పష్టం చేసేదే
అసలైన సాహితీ ప్రమాణం.కేవలం జీవితంలో చూసిన,ఊహించిన,అనుభవించిన సంఘటనలకు రూపం కాదు,ఆ సంఘటనలు చెప్పలేని
అస్పష్ట భావనలకు రూపం కూడా.
41) ప్రతి మనిషికి
తనలోని మేధస్సును ప్రకటించుకోవాలనే
అంతర్లీన కోరిక ఉంటుంది.అదే మనిషిలో ఓ తపనను జ్వలించేలా చేస్తుంది. కానీ
కవుల్లో చాలామందికి భావాల పట్ల స్పష్టత ఉన్నా కవిత్వానికి రాయాలనుకున్న అంశం పట్ల
స్పష్టతతో పాటు వస్తుధ్వని,రసానుభూతి,వినూత్న
క్లుప్తత వంటివెన్నో కూడా అవసరమవుతాయి.
వాటి పట్ల అవగాహన,స్పష్టత ఉన్న కవులు,తమ తరువాతి తరం వారికి వాటి పట్ల అవగాహన కల్పించకపోవడం,కల్పించినా అది నిరుత్సాహపరిచే విమర్శ అవ్వడం,ఎవరూ
విమర్శలను స్వీకరించే స్థితిలో లేకపోవడం వంటివెన్నో కవి స్థానాన్ని కవి అవ్వకుండానే
నిర్థారిస్తున్నాయి.కానీ ఎంతమంది కవులున్నా,ఎన్ని
పుస్తకాలొచ్చినా,అవి పాఠకులను చేరగలవు కానీ వారి అక్షరాలే ఆ
పుస్తకాన్ని పక్కన పెట్టేయ్యకుండా చేయగలవు.
42) లిఖిత బాష లేని
కాలం నుండి ఎలక్ట్రానిక్ కాలం వరకు,ఇక భవిష్యత్తులోని ఏ
కాలంలోనే అయినాస సరే మనిషికి బాధ,సంతోషం ఉన్నంతవరకూ అక్షర కర్షకుడు
జీవిస్తూనే ఉంటాడు.
43) ఒక్కో స్థాయిలో
ఒక్కో ప్రయోజనం త్యాగాలను కాకుండా హత్యలు కోరుతుంది.త్యాగాలకు-హత్యలకు మధ్య ఉండే
సమన్వయమే జాతి ప్రగతికి నిర్దిష్ట సూచిక.ఆ దాటిన గీతే నియంతృత్వ హింస.అటువంటి హింస
దీర్ఝకాలిక లేది సమకాలీన ప్రభావాల వల్ల అయ్యి ఉండవచ్చు.ప్రాణాన్ని ఇవ్వలేమన్న
సత్యం ఏ సమర్థనను సమర్థించలేదు.
44) ఒక్కో రంగు ఒక్కో
ఆలోచనకో,భావనకో,అభిప్రాయానికో,విలువకో,లక్ష్యానికో,స్వేచ్ఛకో మనిషిలోని ఓ వైవిధ్యానికో
ప్రతీక.ఆ రంగులన్నీ కలిస్తేనే జీవితచిత్రం సంపూర్ణమవుతుంది.ఆ రంగులు మాయమవుతుంటే
జీవితం ఏదో ఒక చట్రంలోనో,నిర్భందంలోనో సంకుచితమై బంధించబడి
ఉంటుంది.
45) ప్రతి మనిషిలోనూ
స్పందించే గుణం,ప్రతిస్పందించే వాతావరణాన్ని అది ఆశించడం సహజం.కానీ
మొక్కలా పెరగాల్సిన అది ఎండిపోతూ ఉంటే,దానిలోని
స్పందన-ప్రతిస్పందన అంతమవుతుంది.
46) చిత్రాలు మనుషుల
భావనలను అనుసరించి కదులుతాయి.మనషుల అభిరుచుల్లో జీవిస్తాయి కొన్నిసార్లు.సందిగ్ధతతో
ప్రశ్నించేవి ఇంకొన్ని.భావావేశం శ్రుతి చేసిన సంగీతమై రంగుల ప్రపంచంలో ఓ భావానికి
ప్రాణం పోస్తుంది.చిత్రాలు ఆర్ట్ ధెరపీ కూడా.మనసుకు ఓ చిత్రమైన అనుభూతిని
కలిగిస్తాయి.
47) ఆర్థిక
వ్యత్యాసాల మనుషుల జీవన విధానాలనే కాదు భావనలను,విశ్వాసాలను కూడా
ప్రభావం చేస్తాయి.ఉగాది పచ్చడిలోని అన్ని రుచులు అందరికి జీవితంలో లభించవు.అవి
లభించిన వారికే ఆ పచ్చడి జీవితానికి సామీప్యంగా ఉంటుంది.అవి లభించాలంటే మనుషుల
ఆలోచనల్లో మార్పు రావాల్సిందే,కష్టాలు డబ్బుతో పోతాయని
చెప్పలేము.ఆనందం మన ఎంపికల మీద,ప్రభావితమవ్వని మానసిక
ధృఢత్వం మీద ఉంటుంది.
48) మనిషిలో విద్యతో
వచ్చే విజ్ఞత,అవగాహన అతనిలోని అభద్రతల మూలాలను నిర్మూలించి,ధైర్యవంతునిగా చేస్తుంది.ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పేదే అసలైన
విద్య,అదే నిజమైన గురుకులము కూడా.
49 ) మనిషి మనస్తత్వం
నుండే విభేదాలు ఊపిరి పోసుకుంటాయి తప్ప,ప్రత్యేక వాతావరణంలో
కాదు.మనుషుల్లో ఉండే సుపిరీయారిటీ లేదా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్సుల నుండే ఆధిక్యత
అనే వృక్షానికి అనేక వేర్లుగా వ్యత్యాస ధోరణులు జన్మిస్తాయి.
50 ) జీవితంలో మనకు
నచ్చినట్టు ఉండాలంటే అందరికి నచ్చేట్టు ఉండాలనుకోవడం మానేయ్యాలి.కానీ చట్టాల కన్నా
సమాజ నియమాలకు,ఆలోచనలకే ఎక్కువ విలువనిస్తూ,భయపడుతున్నంతవరకు
తప్పదు గొర్రె జీవితం,అది మందకే అంకితం.
51) మనిషిని
పరిస్థితులు, ప్రవర్తనలు కొందరికి మంచివారిని,ఇంకొందరికి
చెడ్డవారిని చేస్తాయి.కానీ మరణించిన వారిని మంచివారుగా భావించడం సహజంగా
జరిగిపోతుంది.ఆరాటాలు,పోరాటాలు అక్కడితో అంతమవుతాయి కనుక.
52) రూపాంతరం,మార్పు
రావాలంటేనే అవి మనకు విరుద్ధంగా కాకుండా మనల్ని లోపల మనగానే స్పృశిస్తూ,స్పర్శకు స్పందన లేని దశలో ఉంటే పేల్చి అయినా,మనలోని
ఆ తీరని కోరికల ఆత్మను శాంతింపజేయాలి.
53) అందరి అక్షరాలకు
ఒకే గుర్తింపు దక్కదు.గుర్తింపు కోసం కాకపోయినా ఏదో ఓదార్పును పొందుదామని,రాయాలన్న
తపన ఉత్ర్పేరకంగా రాసేవారు మొదట ఎదుర్కునే
సందిగ్ధత ఇది.ఏది ఉత్తమం?ఏది అల్పం? అన్న నిర్ణయాల ప్రతిపాదన మనుషుల సునిశితదృష్టికే తప్ప మనుషుల ఆవేదనలకు,అభిప్రాయాలకు వర్తించవు.అనుభవాన్ని బట్టి కదిలే కలం ఒకటైతే,పాఠకనాడీని బట్టి కదిలే కలం ఇంకొకటి,అన్వేషణతో సాగే
కలం ఒకటైతే,ఊహాల్లో విహరింపజేసే కలం ఒకటి...ఈ ఇన్ని ఒకట్లు
ఒకచోటే సాక్షాత్కరింపజేసే ఆలోచనల వెల్లువే ఇంకో కలం...ఇన్ని కలాల మధ్య మెదడు -మనసు
ఇరుక్కుపోతే రాయాలనిపించినా రాయలేము,రాసినది రాయాలనిపించనది
అవ్వచ్చు.
54) పల్లెటూరులో
పవిత్రత,స్వచ్ఛత ఉంటుందన్న భావం బలపడిపోయింది.కానీ మనుషుల మనస్తత్వాలు ప్రభావాలపై
ఆధారపడి ఉంటాయి కనుక,అది ఒప్పుకోవాల్సిన సత్యమే.కానీ నాగరికత
పరిఢవిల్లుతున్న తరుణంలో ఆ నవ్వులు,పువ్వులు,పూలమాలగా చేయగలమా అన్నదే ప్రశ్న.ఉన్నవి అస్తిత్వం కోల్పోతూ,రూపాంతరం చెందే దశలో ఉన్నప్పుడూ తటస్థ తత్వమే దర్శనమిస్తుంది.ఇది మన ఊహ,ఇలా ఉండాలన్న భావన,దానిని అక్షరాల్లో సజీవం చేయడం
కూడా మధురమైన భావనను కలిగిస్తుంది.ఆ భావనలోకి వెళ్ళాలనుంది.
55) వైరుధ్య లక్షణాల
మధ్య ఘర్షణే ఇది.దానం చేసే స్థాయిలో
ఉండాలంటే దానం చేసేదానికి వందల రెట్లైనా అధికులై ఉండాలనే నియమంతో నడుస్తున్న నేటి
దాతృత్వానికి ఈ కవిత దాతకు ఉండాల్సిన అసలైన లక్షణం గురించి చెప్తుంది.తాను పొందేది
విదిలింపుల మధ్య అయినా తాను వాటిని మరచి ఉదారతను ప్రదర్శించడం మనిషిలోని నిజమైన
దాతృగుణానికి ప్రతీక.ఎన్నో దానాలు
పేరొందుతాయి,కానీ అజ్ఞాత మనుషుల్లో,అజ్ఞాన దాతగా ఉండటమే రెండో పాత్ర కు స్ఫూర్తి కూడా.
56) ఎప్పుడు అనుకోని
పరిణామాలు సంభవించడం నాగరికత లక్షణమైనా,ఏ నాటి నుండో రోగదాడి
జరుగుతూనే ఉంది.నిజానికి మనతో నిత్యం ఏ
పరిస్థితుల్లో అయినా ఉండేది మన తనువే తప్ప,ఇంకేది కాదు
అన్నది కూడా కరోనానే స్పష్టం చేసింది.మనిషికి విలువైంది ప్రాణం మాత్రమే అని
హెచ్చరిస్తుంది.ఆప్యాయతలు-అభిమానాలు-ప్రేమలు అన్ని ఆ సురక్షిత బంధం
దాటనంతవరకే....భ్రమ పడకు..అన్న నిజాన్ని ఎలుగెత్తి చెప్తూనే ఉంది.ఎప్పుడు మనం
అనుకోము,ఎందుకంటే ఆ అనుకోవడంలోనే ఎన్నో వాస్తవాలను చూస్తాం
కనుక,అలా అనుకుంటే మనిషికి మనిషికి మధ్య ఉండే అనుబంధాల
పరిమితి అర్థమౌతుంది కనుక.
57) వయసుతో పాటే మనము
ఎదుగుతాము.కానీ కొన్ని సార్లు మాత్రం ప్రేమ వ్యక్తీకరణల్లో ఊహాలు ఎంతో ఆనందాన్ని
కలిగిస్తాయి.ఆ ఊహాల పల్లకే మనిషిలోని 'ఆల్టర్ ఇగో.'
58) రాసే దానికి
ప్రశంసలు,బిరుదులు దక్కనప్పుడు ఎందుకు రాయాలి?అనే స్థాయిలోనే
నిలబడ్డ సమాజం ఇప్పుడు ఉంది.రాస్తే సమాజంపై ప్రభావం ఉండాలి అనేది ఓ కలంలో
ప్రవహించే భావానికి ఉండాల్సిన లక్షణమైనా,సలక్షణంగా దానిని
హత్య చేసి వ్యక్తిగత ప్రయోజనాన్నే ప్రధానంగా చేసుకునే స్థాయికి కలంలో కళలు
రూపొందాయి.
59) కొత్తదనం అంటే
కొత్తగా వచ్చేది కాదు. ప్రయత్నంతో పాత తత్వం నుండి రూపాంతరం చెందేది.అకస్మాత్తుగా
వచ్చే కొత్తదనం చేసే ఉక్కిరిబిక్కిరిలో పాతదే బావుందనిపిస్తుంది.
60) కవిత్వంలో ఉండే
క్లుప్తత పాఠకులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది.కవిత్వంలో తమ జీవితపు సామీప్యాన్ని
దర్శిస్తారు పాఠకులు.ఆ మహానీయతే కవిత్వాన్ని అమరం చేస్తుంది.
61) మనుషుల్లోని
ఎన్నో సందిగ్ధ,అపరిపూర్ణ ఆచరణలు కవితలుగా కొన్ని పరిస్థితుల్లో
ఆవిర్భవిస్తాయి.అవి గాయాలైనా,కొత్త చిగుర్లైనా,ఏవైనా సరే కవిత్వం అక్కున చేర్చుకుంటుంది.సాంత్వననిస్తుంది.
62) కాలానికి
తగ్గట్టు సాహిత్యం వస్తూనే ఉంటుంది.గతాన్ని పనికిరానిదని తీసేయ్యలేదు.ఎందుకంటే గతం
ఆధారంగానే వర్తమాన,భవిష్యత్తులలో మార్పులు సంభవిస్తాయి.అలా అని
గత వైభవంతోను చతికిల పడలేము.కాలానికి తగ్గ తీవ్రత ఉద్భవిస్తూనే ఉండాలి.అదే
సమాజ-దేశ స్థాయిలలో మార్పులకు ప్రధానం.
63) కవితకు ఓ రోజంటూ
లేదు.కవికి,కవిత్వానికి మధ్య ఉన్న అనుబంధమే కవితా పరిధిని కవి
జీవితంలో నిర్ణయిస్తుంది.కవిత్వం కవి ఆలోచనలను,ఆశయాలను
సమర్థవంతంగా సమాజానికి అందించగలిగి,అదే కవిత్వం కవికో
స్పష్టతనిచ్చి,దిశా నిర్దేశం చేస్తే దానికి ఓ రోజుతో
అవసరమేముంది?
64) కవికి ఏ పరిధులు
లేవు.భావం పట్ల స్పష్టత-సమన్వయం కవికి ఉండాలి.ద్వైదీ భావ ఘర్షణ
ఉండకూడదు.కొన్నిసార్లు శృతి మించే మాట నిజమే,ఆ శృతి దేనినైనా సరి
చేస్తే అది సమర్థనీయమే.
65) కవితా వస్తువు
ఏదైనా కావచ్చు.ప్రకృతి,క్షేత్రసేద్యం కవితావస్తువు ఏదైనా దాని
ధ్వనితో మనిషి జ్ఞాన వికాసానికి తోడ్పడే కవిత్వంలో కవి కన్నీళ్ళు కూడా
ఉంటాయి.నిత్వాన్వేషణ కవిత్వం.
66) అక్షరాలు ఏదైనా
చేస్తాయి.మనుషుల ప్రతి భావాన్ని తమ రూపంలోకి మార్చుకుంటాయి.కొన్ని సార్లు ఏర్పడే
సందిగ్ధతతో మౌనాన్ని ఆశ్రయించినా,ఆ అక్షరనిశ్శబ్దము తీవ్ర ధ్వని
చేయడానికే.సాంత్వనను ఇస్తాయి,కన్నీళ్ళు పెట్టిస్తాయి.భావాలకు
మాధ్యమమవుతాయి.
67) కవిత్వంలో గంభీరత,భావుకత
రెండు ఉన్నాయి.ఊహా కల్పనే కవిత్వమైనా రసానుభూతి కలిగించడం దాని ముఖ్య
ఉద్దేశ్యం.ప్రకృతి-పున్నమి రేయి వంటి వస్తువులను,ఎలా కవిత్వ
ధ్వనికి వాడతారన్నది కవి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.సముద్రం,ఆకాశం,కొండా కోనలు,విరహ వేదనను,ప్రణయాన్ని ప్రకృతి కాంతకు పాదాక్రాంతం చేసి ఆస్వాదించగల రసానుభూతిని
ఆవిష్కరించగలగాలి.
68) భావ తీవ్రత గాఢంగా
కవినో,రచయితనో వెంటాడుతూ,దానిని స్పష్టమైన చిత్రంగా
దృశ్యీకరించలేనప్పుడు ఏర్పడే సాహితీవేత్త సందిగ్ధత,అప్పుడు
చెప్పాలనుకున్న అంశాలెన్నో గాయాలై రుధిరంగా ప్రవహిస్తున్నా,ఆ
గాయాన్ని ఏ కట్టుతో మాన్పాలో తెలియక,ఏ అక్షరంతో ఓదార్చాలో
తెలియక తల్లడిల్లే గాయపడ్డ మనిషి,కళాకారుని ఘోషే కవిత్వానికి
కొన్ని సార్లు మూలమవుతుంది.
69) సులభంగా అందరూ
చేయగలరని భావించే పనులు,కానీ నలుగురి ముందు గొప్ప అభిప్రాయం
ఏర్పరచుకోవాలనే తపన,ఏ పని చేస్తే పక్కవారు మన మీద ఏ
అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో అన్న అనుమానం,మన సమయాన్ని,సంతోషాన్ని ఎదుటి వారికి వెచ్చిస్తే మనకేమోస్తుంది అన్న ఆలోచన,ఇవన్నీ వెరసి మనల్ని ఈజీగా ఈ పనులు చెయ్యనివ్వవు.అవే కష్టమైనవి ఆచరణలో.
70) మనిషి
వ్యక్తిత్వంలో తేజస్సు అతని విలువల చైతన్యంలో ఇమిడి ఉంటుందని,అది
వ్యక్తి జీవితంలోని అన్ని దశలకు వర్తిస్తుంది.
71) కొందరు మిత్రులు,బంధువులు
వాస్తవానికి జీవితంలో సంతోషాన్ని కంటే ఇబ్బందులనే తెచ్చి పెడతారు.పోటీలు,పోల్చుకోవడాలు,జోక్యాలతో వ్యక్తిగత స్థాయి నుండి
సమాజ స్థాయి వరకు వారి ప్రభావం వదుల్చుకోలేకుండా తయారవుతారు.తప్పదు....ఆ
భావగ్రాహ్యత కలిగిన రోజు మారి విశ్వనరుడవ్వక తప్పదు.
72) వయసు చిన్నదైనా
బాధ్యతల బరువునుమోసే పరిణతి సిద్ధించడం కూడా ఓ కోణంలో ఆలోచిస్తే ఓ అపూర్వ
శక్తేనేమో!ముందు కుటుంబం,తరువాత తను అని ఆలోచించగల పరిపక్వత ఏ
వయసయితేనేం ....ఆడపిల్లకు సిద్ధిస్తుంది.దాని వల్ల తనను తాను కోల్పోయినా దానిని
సాధారణంగా భావించే విశాలమనస్తత్వం ఆమెది.
73) మనుషుల మధ్య
అకారణంగా తలెత్తే ఇగోల వల్ల దూరాలు పెరిగిపోతూనే ఉంటాయి.విద్యావంతులైన మనం
హేతుబద్ధంగా ఆలోచిస్తే అది అల్పాంశం అనిపిస్తుంది.'మనం-మన ఆధిక్యత'
అన్న ధోరణితో ఆలోచించినప్పుడు ఆ పంతం ఇద్దరిఐమధ్య మౌన గోడగా
మిగిలిపోతుంది.అది కరిగించాలంటే ఎవరో ఒకరు
మనిషికి మించి ఆలోచించగాలి.బహుశా ప్రస్తూట సమాజంలో అలా ఆలోచించలేకపోవడమే
పెద్ద సమస్య అనుకుంటా.
74) తలుచుకుంటే
తప్పిపోయిన ఆ జీవితంలో కోల్పోయిన మాధుర్యం ప్రత్యక్షమవుతుంది.ఉన్న దానిని
వినియోగించుకోవడం,ఉన్న దానితో సంతృప్తిగా జీవించడం,పుస్తకాలు మన కన్నా పై తరగతుల వారిని అడిగి తీసుకోవడం,నోటు పుస్తకాలు మనమే తయారు చేసుకోవడం,ఇలా అన్ని మధుర
స్మృతులే.
75) నేటి శైలిలో
ఎదగడమంటే మనలోని మనిషి నుండి దూరంగా
పారిపోవడమే.బాల్యంలో ఖర్చులు-లాభాలు లెక్కలేసుకుని మనం వయసు పెరిగే కొద్ది వాటి
గురించే ఆలోచిస్తాం.జీవితమంటేనే అవన్న
ఆలోచనతో ఎదుగుతున్న మనం ఎదుగుతున్నాము,మనం మాత్రమే మనమున్న ప్రపంచంలోనే
ఎదుగుతున్నాం.
76) గమనం
మొదలవ్వాలంతే.మొదట అస్పష్టమైన సరే అది సాగూతూ ఉండాల్సిందే.కొంత కాలానికి ఆ గమనం
స్థిరత్వానికి చేరుకుని గమ్యాన్ని స్పష్టం చేస్తుంది.
77) జీవితంలో ప్రతి
దశలో పక్క వారిని దాటుకుంటూ పోతూ,అదే విజయమని భావిస్తూ,ప్రతి జీవితాంకంలో పోటీదారులని వెతుక్కుంటూ,అందులో
గెలుపులే ముఖ్యం జీవితానికి అన్న పరుగు వీడి ఏదో ఓ రోజు జీవించడంలో ప్రేమ,సేవ,ఆత్మదర్శనం ఉన్నాయని తెలుసుకుని నిదానంగా ఆ
దారిలో పయనిస్తూ జాగ్రత్తగా జాగురకతతో వ్యవహరించే వాడు జీవించడంలో విజయం
సాధిస్తాడు.
78) జీవితమే
రాజకీయం.అది వ్యక్తుల మధ్య,సంస్థల మధ్య,దేశాల
మధ్య నిత్యం ప్రచ్ఛన్న యుద్ధంలా సాగుతూనే ఉంటుంది.ఈ బహిరంగ యుద్ధం ఓ వైపు,ఇంకోటి తెలిసి తెలియనితనంతో,మిడి మిడి జ్ఞానంతో
మధ్యలో కొందరు జనులు ఏవో నమ్ముతూ,వాస్తవ దూరంగా అపోహల్ని
బలపరిచే మనస్తత్వాలతో యుద్ధం ఇంకో వైపు.ఈ బహిరంగ,అంతరంగ
యుద్ధాలను చేస్తూనే విజయం సాధించగలగడం ఇంకో యుద్ధం.ఇన్ని యుద్ధాల మధ్య మనం కిస్త
అప్రమత్తులై ఉండాల్సిందే.
79) కవి ఏం రాస్తాడు
అన్నది కవికి మాత్రమే సంబంధించిన అంశమైన,రాసాక మాత్రం
విశ్వజనీనమౌతుంది.ఒక్కో కవిది ఒక్కో శైలి.కవుల విద్య,వారి
సాహిత్య పరిచయం,అనుభూతులు-అనుభవాలు,వ్యథలు,కోపతాపాలు...ఇలా జీవితంలోని ప్రతిదీ వారి అక్షరాలను అంతర్లీనంగా ప్రభావితం
చేస్తూనే ఉంటుంది.ఆ ప్రభావలన్నింటిని సమన్వయపరచుకుని,సమాజం
మీద ప్రభావం చూపేలా రాసేవాడే కవి లేదా రచయిత అయినా.
80) సమాజం లో ఆది
నుండి బార్టర్ సిస్టమ్ ఉంది.అంటే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం.మనకు లేనిది ఇతరుల నుండి
తీసుకుని,వారికి కావాలసింది మనం ఇవ్వడం.కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఆ సరుకు డబ్బు
గానే మిగిలిపోయింది.ప్రతిదానికి వాహకంగా మారడం వల్ల ప్రపంచ స్థాయిలో దాని విలువ
తగ్గుతూ,ఈ స్థానిక
స్థాయిలో మాత్రం దాని విలువ పెరుగుతుంది.భావోద్వేగ అవసరాలు,మనుగడ అవసరాలు కేవలం డబ్బు తీర్చగల అవసరాలు కాదు.అది ఒక మాధ్యమమే అనే
స్థాయి దాటి అది ఒక్కటే మాధ్యమమన్న అభిప్రాయానికి రావడం వల్ల మనిషి దానినే నమ్ముతూ
దాని కోసమే పయనిస్తూ,ఎండమావుల మధ్యలో కూలబడుతున్నాడు.ఏ
అవసరాన్ని ఏది తీరుస్తుందో స్పష్టత తెచ్చుకోవడం ప్రధానమైన అంశం.
81) సృజన చౌర్యం
ఏనాటి నుండో సాగుతూనే ఉంది.ఆలోచనలు-అభిప్రాయాలు కూడా పంచుకోలేని స్థితిలో ఉన్నారు
కళాకారులు.కళ ఏదైనా అది ఎవరి మెదడులో జనించింది అన్నది ముఖ్యం కాదు,దానిని
ముందు ఎవరు వేదికగా చేసుకున్నారు అన్నదే నేడు ప్రధానం అయ్యే పరిస్థితులు
వచ్చాయి.ఘోస్ట్ రైటర్స్ సంస్కృతి సాహిత్యానికి పట్టిన పెద్ద చీడ కూడా.ఎందరో తమ
రచనలను స్వంచ్ఛందంగా తాకట్టు పెట్టుకుంటున్నారు,ఇంకొందరు
చౌర్యానికి గురవుతున్నారు.అందుకే రచనను అభిమానించండి కానీ రచయితను కాదు
అంటారు.అందుకే నేటికి ఎవరిది ఏ రచనో కొన్నిసార్లు చెప్పలేము.
82) మతాలు-మూఢ
విశ్వాసాలు,పవాత్రత-అపవిత్రత,కులాలు వీటి
ఆధారంగా ఆలోచించేవారు సైన్స్,చరిత్రలను తెలుసుకుని సమగ్ర
ఆలోచనా చింతనను అలవర్చుకుంటే సమాజపు మూఢకూడ్యాలు ధ్వంసమవుతాయేమో!జన్యు శాస్త్రం ఈ
రెండు శాస్త్రాలకు గొప్ప ఆలంబన.
83) శాశ్వతం ఏది కాదు
కాబట్టే దేనిని పట్టించుకోకుండా సాగే ధోరణి కూడా విజృంభిస్తుంది.ఈ తత్వం మనిషిని
మంచి వరకు ఎలా తీసుకువెళ్తుందో,సరిగా అర్థం చేసుకోకుంటే నిర్లక్ష్యంగా
ప్రవర్తించే ధోరణిని అలానే అలవడేలా చేస్తుంది.
84) జీవితంలో మన మీద
ఎవరైనా ప్రేమను చూపించాలంటే వివిధ పద్ధతులను అనుసరిస్తారు. కానీ ఒక్క అమ్మే
ప్రత్యేకం. ఆమె ప్రతి చర్యలో ప్రేమ ఉంటుంది. ఆమె చీర కొంగుతో మన స్వేద బిందువులను
తుడవడం,
దాని చాటున మనం దాక్కోవడం, ఆ చీరనే ఊయలగా
మార్చడం, ఏం లేకపోయినా ఆమె తన ప్రేమను లేమిలోనూ,కలిమిలోనూ ప్రవహింపజేస్తూనే ఉంటుంది. కవితలకు మనల్ని ఆ లోకంలోకి
తీసుకువెళ్లే శక్తి ఉంది. ఆ కవితలోని అనుభూతి అనుభవంలోకి రాకపోయినా దానిని ఊహాగా
స్పృశించగల శక్తిని ఇస్తుంది. ఇది అందరికీ నేడు వర్తించకపోవచ్చు. ఆధునికతలో
వ్యక్తపరిచే విధానాలు మారిపోయాయి కనుక.
85) సమాజంలో దారుల
మీద దారులు వేస్తూనే ఉంటారు.మొదట ప్రజాస్వామ్యంగా మొదలయ్యే ఆ పయనం అటు తరువాత
నియంతృత్వంగా మారుతుంది.దాని ప్రతిపక్ష దారిది అదే తోవ.ఆ పరిస్థితుల్లో పౌరులు 'అడ
కత్తెరలో పోక చెక్క'లా నలిగిపోతుంటారు.ఆ మధ్య మార్గాన్ని
అన్వేషించడం,వెతకడమే అసలైన మేధావి చేసేది.
86) జీవితంలో ప్రతి
దశలో పరీక్షలు సహజం.విద్యలో పరీక్ష
భవిష్యత్తు పట్ల అభద్రతను,వివాహంలో పరీక్ష సమాజం-కుటుంబంలో అభద్రతను,పరిస్థితుల పరీక్షలు బ్రతుకు పట్ల అభద్రతను మొదట సృష్టిస్తాయి.వాటిల్లో
గెలుపు,ఓటములు ఉండవు వాస్తవానికి.ఆ తెరను సృష్టించి,దానిని ఆ అభద్రతలకు మూలంగా చేసేది మనమే.మన ఆలోచనల్లో దాని పట్ల సానుకూలతే
ఓ పరీక్ష.
87) ఈ ప్రపంచంలో
అన్నిటికన్నా ప్రమాదకరమైనది త్వరగా
ప్రభావితమయ్యే మనసు.ఆ విపరీత ప్రభావమే మూఢత్వంగా మారి,విధ్వంసకర్తలను
సృష్టిస్తుంది.మనసులో చెత్త పేరుకుపోవాలంటే అది ఆ ప్రభావంలో పుట్టాలి లేదా
పెరగాలి.అది మంచైనా,చెడైనా కూడా ప్రమాదమే.ఎందుకంటే అందరికి
ఒకే జీవన గమనం,లక్ష్యం,తృప్తి,సంతోషం ఉండవు కనుక.ప్రభావితమవ్వని మనసును పెంచగలిగితే మనుషుల ఆలోచనల్లో
హేతుబద్ధత,కారణం స్పష్టమవుతాయి.
88) జ్ఞాపకాలు
కదిలిపోయిన కథలే కాదు,తలచుకున్నప్పుడే ప్రత్యక్షమయ్యే అందమైన కలలు
కూడా.ఆ ఇల్లు-అరుగు అదృశ్యమైనా అవి సాక్షీభూతమై ఎన్నో సన్నివేశాలన్ని,ఎందరో మనుషుల్ని,ఎన్నో పరిస్థితులను మన జీవితంలో ఓ
భాగం చేస్తూ మనదైన ప్రత్యేక అనుభూతి-అనుభవ సంపదను సొంతం అయ్యేలా చేస్తుంది.ఊహించని
నుండి సహజంగా మారిన మార్పులు కాలం గడిచే కొద్ది మన దృక్కోణాన్ని మార్చేస్తాయి.అవి
తలచుకోవడానికి లేకపోయినా దానితో ఉన్న అనుభవమే నేడు గొప్పగా పరిగణించాల్సిన
అంశమేమో!
Comments
Post a Comment