గులాబీల వేడుక

 చదువరి

గులాబీల వేడుక

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



           చారిత్రక నవలలకు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది.ఆ నవలల్లో  చరిత్రను పాఠకులకు పరిచయం చేస్తూనే ముఖ్య ఉదంతాలలో కచ్చితమైన వాస్తవ దృష్టి ఉంటే అవి విజ్ఞానదాయకమైన సాహిత్యంగా మారతాయి.అటువంటి నవలా రచయిత్రి ఇందు సుందర్శన్ . భారత దేశాన్ని పరిపాలించిన మొఘల్ సామ్రాజ్యంలో చక్రవర్తుల పాలనలో స్త్రీల పాత్రను గురించి మూడు నవలలు రాసిన భారతీయ రచయిత్రి (అమెరికాలో స్థిరపడ్డారు ప్రస్తుతం)ఇందు సుందర్శన్ గారి తాజ్ ట్రయలాజి నవలల్లో రెండో నవల ద ఫీస్ట్ ఆఫ్ రోజెస్.ఈ నవలలో జహంగీర్ ఇరవయ్యవ భార్య అయ్యి,అప్పటికే ఇంకొకరి వల్ల ఓ ఆడపిల్లకు తల్లి అయ్యి కూడా, జహంగీర్ భార్యగా అడుగుపెట్టిన మెహరున్నీసా (నూర్జహాన్) ఎలా 16 సంవత్సరాలు అతని పేరు మీదుగా మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్నే ఏలి౦దో,తన స్థానం కోసం ఎలా నిత్యం తన వ్యూహాలను పన్ని౦దో స్పష్టం చేసే నవల ఇది. ఈ నవలలోని ఉదంతాలలో ఊహలు అవసరాన్ని మించి లేవు. మీకు చరిత్ర ఇష్టమైతే తప్పకుండా చదవాల్సిన నవల ఇది.

          చక్రవర్తులకు భార్యలు,బానిసలు ఉండటం సహజం. ఎందరో భార్యలు,ఎందరో బానిసలు,ఎవరిని కోరుకుంటే వారు పక్కన ఉండే పరిస్థితుల్లో రాజుల,చక్రవర్తుల పాలనలు గడిచాయి.అంతమంది భార్యల్లో ఎవరి పట్ల రాజుకు అనురక్తి ఉంటుందో వారే ఆ రాజ్యంలో,మిగిలిన భార్యల పట్ల,అన్నింటి మీద అధికారం సంపాదించగలరు. మొఘల్ సామ్రాజ్యంలో అప్పటి వరకు చక్రవర్తి ముఖ్య భార్యకు మాత్రం రాజ ముద్ర ఉండేది. ఆమె దాని ద్వారా ఆ రాజ్యానికి మిగిలిన రాజ్యాల లేదా దేశాల మధ్య వ్యాపారాలకు,సంబంధాలకు ఆ ముద్ర ఆమోదాన్ని ఇస్తుంది.ఆ రాజ ముద్ర కలిగిన భార్య పాద్షాహ్ బేగం. అంటే ఆ బిరుదు ఆమెకు ఆ చక్రవర్తికి ఉన్న అందరి స్త్రీలకన్నా అధిక అధికారం ఉన్నట్టు సూచిస్తుంది.

          జహంగీర్, మెహరున్నీసాను పెళ్ళి చేసుకున్నాడు. మెహరున్నీసాను తాను యవ్వనంలో ఉన్నప్పుడే జహంగీర్ (సలీం) ఇష్టపడ్డాడు.కానీ ఆమెకు పర్షియన్ సైనికుడైన షేర్ ఆఫ్ఘన్ తో వివాహమవుతుంది.ఆమెకు అతని ద్వారా ఓ కూతురు కూడా పుడుతుంది.తర్వాత అతను మరణిస్తాడు. జహంగీర్ తండ్రి అక్బర్ కి పద్షాహ్ బేగంగా ఉన్న రుక్కయ్య దగ్గర ఉన్న మెహరున్నీసా పట్ల మళ్ళీ గతంలో ఏర్పడిన ఆకర్షణ ,ప్రేమ చిగురిస్తాయి చక్రవర్తి మనసులో. రుక్కయ్య  సాయంతో ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.అప్పటికే మెహరున్నీసాకు 34 ఏళ్ళు.ఆమె కూతురు లాడ్లి.

          మెహరున్నీసా జహంగీర్ కు ఇరవయ్యవ మరియు ఆఖరి భార్య.అప్పటికే పద్షాహ్ బేగంగా ఉంది జాగత్ గోసైన్.ఆమె కొడుకు ఖురామ్.తాను భార్యగా అవ్వగానే జహంగీర్ ద్వారా ఆ సామ్రాజ్యం మీద తన అధికారాన్ని పెంచుకోవాలనే ఆలోచించింది మెహరున్నీసా. తాను అనుకున్నది సాధించడానికి ఎవరూ ఆలోచించడానికి సాహసించలేని వాటిని కూడా చేయడానికి పూనుకోవడమే మెహరున్నీసాను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది.అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్యంలో మేలు ముసుగు వెనుకే ఉండే వారు స్త్రీలు.కానీ మెహరున్నీసా తాను కూడా జహాంగీర్ తో కలిసి రోజు దర్బార్ కు వచ్చేలా చక్రవర్తిని ఒప్పించింది.ఆ జెనానా (సామ్రాజ్యంలో స్త్రీలు ఉండే రాణివాసం)లో ఉన్న స్త్రీలందరూ అది తెలిసి ఆశ్చర్యపోయారు. వారిలో చాలా మంది తమకు ఆ అదృష్టం పట్టనందుకు ఆమె మీద కోపం కూడా పెంచుకున్నారు.

          ఈ విషయం పాద్షాహ్ బేగంకు తెల్సింది. అప్పటి వరకు తనకున్న ప్రాధాన్యత మెహరున్నీసాకు దక్కుతుందని ఆమె గ్రహించింది. పాద్షాహ్ బేగమ్  వేటాడటంలో దిట్ట. జహంగీర్ వేటకు వెళ్తున్నాడని తెలిసి ఆమె కూడా వెళ్తుంది. అక్కడ వేటలో ఎవరైతే వేటాడుతారో వారికే చక్రవర్తి అనుకూల దృష్టి ఉంటుంది సాధారణంగా. ఈ వేట కార్యక్రమంలో ఏ జంతువునైతే చక్రవర్తి వేటాడబోతాడో దాని మీద కొన్ని రోజుల ముందు నుండి నిఘా ఉంచి,దానికి మత్తు మందులు ఇచ్చి, దానిని వేటకు సానుకూలంగా ఉండేలా సిద్ధం చేస్తారు. ఆ రోజు అలా సిద్ధంగా ఉన్న ఓ సింహాన్ని మెహరున్నీసా,జాగత్ గోసైన్ ఇద్దరీలో ఎవరూ చంపుటారో అని అందరూ ఎంతో ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు. మెహరున్నీసా కనీసం విల్లును గురి పెట్టకముందే జాగత్ దానిని వీళ్ళుతో చంపింది. దానితో ఇక జాగత్ వైపే రాజు సానుకూలంగా ఉంటాడని రాజ్యం అంతా ఆశించింది.అప్పటికి  జహంగీర్ కూడా అలానే ప్రవర్తించినా,తర్వాత కొన్ని రోజులు మెహరున్నీసా దగ్గరకు కూడా వెళ్ళకుండా ఉండినప్పటికీ ఆ తర్వాత ఆమె వైపు మగ్గు చూపాడు జహంగీర్. ఆ తర్వాత రాజముద్ర కూడా మెహరున్నీసాకే అప్పగించాడు.

          ఆ రోజుల్లో రాణివాసానికి కాపలాగా ట్రాన్స్ జెండర్స్ ఉండేవారు. జాగత్ కు మొదటి నుండి నమ్మకంగా ఉన్న హోషియార్ ఖాన్ ను మెహరున్నీసా రాగానే తన ముఖ్య కాపలాదారుడిగా వేయించుకుంది.అలాగే ఆ రాజ్యంలోని అందరి పైన ఓ కన్ను వేసి ఉంచింది. ఆఖరికి జాగత్ ముఖ్య కాపలాదారుడిని కూడా తన వైపు తిప్పుకుంది. మెహరున్నీసా తర్వాత కాలంలో విల్లు గురి పెట్టడం కూడా నేర్చుకుంది.

                    మెహరున్నీసా తండ్రి,తమ్ముడు అబుల్ కూడా అదే రాజాస్థానంలో ఉన్నారు. మెహరున్నీసా అధికారం పెరగడం వల్ల వారి అధికారాలు కూడా పెరిగాయి. అదే రాజ్యంలో ఉన్న ఇంకో ఇద్దరు మహబత్ ఖాన్ ఆ రాజ్యంలో జహంగీర్ తో పాటు పెరిగినవాడు. మెహరున్నీసా వచ్చేంతవరకు కూడా అతని ప్రభావం జహంగీర్ పైన ఉండేది.కానీ ఆమె రాకతో ఆమెకే జహంగీర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.

          జహంగీర్ కొడుకు అయిన ఖురామ్ కు అబుల్ కూతురుకు ఐదేళ్ల క్రితం నిశ్చితార్ధం అయినా అది పెళ్ళిగా మారలేదు. మొదటి నుండి మెహరున్నీసా అంటే ఇష్టం లేని జాగత్ ఆ ఇంటి వారిని ఎప్పుడు బంధువులను చేసుకోకూడనే ఉద్దేశ్యంతో ఆ పెళ్లి జరగకుండా చేసింది. ఖురామ్ ను బాల్యం నుండి రుక్కయ్య పెంచింది.బాల్యంలోనే అక్బర్ ద్వారా అతన్ని తన దగ్గరకు తెచ్చుకుంది. ఖురామ్ ఆమెనే అమ్మగా భావించేవాడు. ఆ తర్వాత కాలంలో ఖురామ్ అబుల్ కూతురైన అర్జుమండ్ ను ఖురామ్ ఇష్టపడటం,ఆమెతో అతని వివాహం జరగడం జరుగుతుంది.

          రాజ్యంలో సింహాసనం కోసం కుట్రలు మామూలే. తండ్రి-కొడుకుల మధ్య జరిగే కుట్రలే ఎక్కువ. జహంగీర్ కు మొదటి కొడుకును ఇచ్చిన మంభావతిబాయి కొడుకు ఖుస్రవ్. అతను సింహాసనం కోసం తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. దానిలో ఓడిపోయాడు. జహంగీర్ అతన్ని గుడ్డివాడిని చేసి, కారాగారంలో ఉంచాడు. కొన్నేళ్ళ తర్వాత అతను విడుదలై వైద్యులు చూసిన ఒక కన్ను మాత్రం గుడ్డి గానే మిగిలిపోయింది. మహబత్ ఖాన్  తన మీద చక్రవర్తికి వ్యతిరేకంగా చెప్పాడని తెలుసుకున్న మెహరున్నీసా తెలివిగా  అతన్ని రాజ్యానికి దూరంగా వేరే ప్రాంతానికి గవర్నర్ గా పంపేస్తుంది రాజు ఆమోదంతో.

          మెహరున్నీసా గర్భవతి అవుతుంది. తన కొడుకును ఎలా అయిన యువరాజు చేయాలని ఆమె ముందే పథకాలు రచిస్తూ ఉంటుంది. కానీ ఆమెకు గర్భస్రావం అవ్వడం వల్ల ఆమె ఆశలు ఆవిరైపోతాయి. ఇక ఆ మార్గం లేకపోవడం వల్ల తర్వాత యువరాజు అయ్యే అవకాశం ఉన్న ఖురామ్ ను తన కూతురైన లాడ్లీకి ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. జహంగీర్ కూడా ఒప్పుకున్నప్పటికీ ఖురామ్ దానికి సుముఖంగా ఉండడు ఎందుకంటే ఆ వివాహం అర్జుమండ్ కు ఇష్టం లేదు కనుక. అర్జుమండ్ మెహరున్నీసా పద్ధతుల పట్ల ఆమె పట్ల అయిష్టతను పెంచుకుంది.

          ఇక ఖురామ్ ఒప్పుకోవడం లేదని భావించిన మెహరున్నీసా ఖుస్రౌకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది మెహరున్నీసా. అతను కూడా ఆమెను నిరాకరిస్తాడు. అదే సమయంలో ఖురామ్ ఓ యుద్ధానికి రాజ్యం వదిలి వెళ్ళాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. ఒకవేళ ఖుస్రౌను వదిలి వెళ్తే ఎక్కడ మెహరున్నీసా అతన్ని అల్లుడిని చేసుకుంటుందో, తను మళ్ళీ తనకు ఎక్కడ పోటీ అవుతాడో అని అతన్ని కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు. ఇక జహంగీర్  కు   ఉన్న ఇంకో ఇద్దరు కొడుకుల్లో షహర్యార్ ను తన అల్లుడిని చేసుకుని అతన్నే తర్వాతి చక్రవర్తిని చేయాలని నిర్ణయించుకుంటుంది మెహరున్నీసా. మెహరున్నీసా ఆ సమయంలో ఇతర దేశాల ప్రతినిధులను కూడా తన గుప్పిట్లోనే ఉంచుకునేది.

          యుద్ధం ముగిసిన తర్వాత ఖుస్రౌను హత్య చేయిస్తాడు ఖురామ్. అతను జబ్బుతో మరణించాడని నమ్మింపజేసినా, అతనే హత్య చేయించాడనే విషయం తెలిసిపోతుంది. జహంగీర్ ఆగ్రహానికి గురవ్వడం ఇష్టం లేకపోవడం వల్ల అతను రాజ్యానికి తిరిగి రాడు. అదే సమయంలో జహంగీర్ కు అనారోగ్యం ఉండటం వల్ల కాశ్మీర్ కు వెళ్తారు. అక్కడ కె సంపదను తరలించమని ఆ బాధ్యతను అబుల్ కు అప్పగిస్తుంది మెహరున్నీసా. ఆ సంపదను ఖురామ్ దోచుకోవడానికి సహకరించి అతను రాజు అవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్న అతన్ని మళ్ళీ పట్టుకుంటుంది మెహరున్నీసా. అబుల్ ను తన గుప్పిట్లో ఉంచుకుంటుంది.కానీ తన అల్లుడైన ఖురామ్ కు సాయం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మహబత్ ఖాన్ ను రాజ్యానికి రప్పిస్తే బావుంటుందని భావించిన మెహరున్నీసా జహంగీర్ ద్వారా అతనికి కబురు పెడుతుంది. తన అల్లుడి ద్వారా అసలు విషయం తెలుసుకోవాలని అతన్ని అక్కడికి పంపిస్తాడు మహబత్ ఖాన్. మెహరున్నీసా ప్రభావంతో జహంగీర్ మహబత్ ఖాన్ తన ఆజ్ఞను ధిక్కరించాడని భావించి మహబత్ ఖాన్ అల్లుడిని బంధిస్తాడు. తనకు, చక్రవర్తికి మధ్య ఉన్న  చిన్న అపార్ధాన్ని తొలగించుకోవాలంటే అతన్ని వ్యక్తిగతంగా కలిసి జరిగింది చెప్పాలని భావిస్తాడు మహబత్ ఖాన్. కానీ మెహరున్నీసా అసలు ఆ అవకాశం ఇవ్వకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాజును బంధిస్తాడు మహబత్ ఖాన్. అదే సమయంలో మెహరున్నీసాను కూడా బంధిస్తాడు. మెహరున్నీసా జహంగీర్ ను ప్రభావితం చేస్తుందని ఆమెను చక్రవర్తి దగ్గరకు కూడా వెళ్లనివ్వడు. అసలే అనారోగ్యంతో ఉన్న జహంగీర్ మరణిస్తాడు. మహబత్ ఖాన్ కు చక్రవర్తి అవ్వాలనే ఆశ లేదు. అందుకని వారిని వదిలేస్తాడు. ఆ సమయంలో అన్నీ సంప్రదింపులు అబుల్ ద్వారా నడిపిస్తుంది మెహరున్నీసా.

          జహంగీర్ మరణంతో తన అల్లుడిని తర్వాతి చక్రవర్తిని చేయాలని తలంచిన మెహరున్నీసాకు వ్యతిరేకంగా అబుల్ తన అల్లుడైన ఖురామ్ ను అదే సమయంలో రంగంలో ప్రవేశించేలా చేస్తాడు అబుల్.నాటితో మెహరున్నీసా ఏలిక పూర్తవుతుంది. ఖురామ్ తర్వాతి చక్రవర్తి అవుతాడు.

          ఇక్కడితో ఫీస్ట్ ఆఫ్ రోజేశ్ నవల ముగుస్తుంది. ఓ సారి జహంగీర్,మెహరున్నీసా బహిరంగంగా కొట్టుకుంటారు. దానితో జహంగీర్ ఆమె మొహం వైపు కూడా చూడడని అందరూ అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఆ అభిప్రాయం ప్రజల్లో పోగొట్టడానికి,మెహరున్నీసా మీద తన ప్రేమ ఏనాటికి తగ్గడాని నిరూపించడానికి జహంగీర్ ఆమెను ఆ కోటలోపలి గులాబిల తోటలో ఆమె మీద గులాబీల వర్షం కురిపిస్తాడు. అందుకనే ఆ సంఘటన ఆధారంగా ఈ నవలకు ఈ పేరు రచయిత్రి పెట్టారు. మెహరున్నీసా తర్వాత అర్జుమండ్ కోసం తర్వాత ఖురామ్ తాజ్ మహల్ కట్టాడు. అర్జుమండ్ వ్యక్తిత్వం మెహరున్నీసా లాంటిది కాదు.ఆమె ఏనాడూ మెహరున్నీసాలా వ్యక్తిగత అధికారం కోరుకోలేదు. బాల్యం నుండి రుక్కయ్య,జాగత్ ,మెహరున్నీసాల ద్వారా స్త్రీలు ఎలా తమ భర్తలను ప్రభావితం చేస్తారో స్వయంగా చూసిన  ఖురామ్ అటువంటి ప్రవర్తనకు పూర్తి వ్యతిరేకంగా ఉండి,అతనికి పూర్తి సహకారం అందించినందుకు ఆమె పట్ల ఎంతో ప్రేమను పెంచుకుంటాడు ఖురామ్.

రాజ్యతంత్రాలు ఎలా నడుస్తాయో ఈ నవల స్పష్టం చేస్తుంది. ఎంతో ఆసక్తి కలిగేలా రాసిన ఈ నవల కచ్చితంగా చదవాల్సిన నవల.

                        *    *    *

         

                  

         

 

 

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ